అత్తారింటి నుంచి ప్రాణహాని: హెచ్చార్సీకి చక్రి భార్య శ్రావణి
హైదరాబాద్: అత్తారింటిపై చక్రి సతీమణి శ్రావణి మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)కి ఫిర్యాదు చేశారు. తన భర్త చక్రి కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణ హానీ ఉందని, అందుకే హెచ్చార్సీలో పిర్యాదు చేశానని శ్రావణీ తెలిపారు. తన రూంలోని కప్బోర్డుకు తాళం వేశారని ఆమె చెప్పారు. తనకు వివాహం అయి తొమ్మిదేళ్లు అవుతుందని ఆమె మీడియాతో అన్నారు. ఇంట్లో చిన్న గొడవ జరిగి ఈ మధ్యనే తన అత్తయ్య, మరిది ఇంటి నుంచి వెళ్లిపోయారని, నన్ను కోడలిగా చూసేవారుకాదని ఆమె అన్నారు. అత్తను, మరిదిని నేను ఇంటి నుంచి వెళ్లిపొమ్మనలేదని, వారే వెళ్లిపోయారని, ఆ మరుసటి రోజునే మళ్లీ రమ్మని చక్రీతో చెప్పానని, అయినా వాళ్లు రాలేదని శ్రావణి తెలిపారు.
ఇప్పుడు కూడా తనకు అత్తింటివారి నుంచి ఎలాంటి మద్దతు లేదని, అసభ్యకర మాటలతో వేధించేవారని, ఇంట్లో అన్ని కఫ్బోర్డులకు తాళాలు వేశారని అన్నది. చక్రిని తానే చంపేశానని వేధించడంతో తట్టుకోలేక హెచ్చార్సీకి పిర్యాదు చేశానని శ్రావణి అన్నారు. అత్తింటివారిని రోడ్డుమీదకు లాగాలని తనకు ఏమాత్రం లేదని, కుటుంబం అంటే చక్రీకి చాలా ఇష్టమని ఆమె చెప్పారు.
చక్రి చేపట్టిల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయని, ఆ బాధ్యతలన్నీ తన మీద పడ్డాయని ఆమె అన్నారు. అత్తను, మరిదిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా తన మీద ఉందని శ్రావణి చెప్పారు. వాళ్ళ పేరు మీద కొంత పిక్సిడ్ డిపాజిట్ చేయాలని ఉందని, 11 రోజుల కార్యక్రమం పూర్తి కాగానే కుటుంబ సభ్యులం అందరూ కూర్చుని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుంటామని, ఇప్పుడు వాళ్లు నావాళ్లని, వాళ్లని ప్రేమగా చూసుకుంటానని శ్రావణి స్పష్టం చేశారు.
ఇన్నాళ్లుగా తమ కుటుంబాన్ని పట్టించుకోనివాళ్లు ఇప్పుడు ఆయన మరణించిన తర్వాత వచ్చి తనను వేధిస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనన్న భయం వల్ల మాత్రమే తాను హెచ్చార్సీ వద్దకు వెళ్లానని శ్రావణి చెప్పారు. చక్రి ఆత్మకు శాంతి కలగాలని, ఇప్పట్లో ఎలాంటి వివాదాలకు వెళ్లదలచుకోలేదని అన్నారు.
చక్రి, శ్రావణిలది ప్రేమవివాహం. పదేళ్ల క్రితం వాళ్లు పెళ్లి చేసుకున్నారు. దాంతో ఇటీవలి వరకు అయినవాళ్లంతా వాళ్లకు దూరంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే అంతా దగ్గరకు వస్తున్నారు. గతంలో శ్రావణి మీద దాడులు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. సుమారు నెల రోజుల క్రితం ఆమె అత్త, మరిది విడిగా వెళ్లిపోయారు. చక్రి మరణించిన తర్వాత వాళ్లంతా కలిసి చక్రి ఇంట్లోనే ఉంటున్నారు.