'అవాస్తవాల వెంకయ్య': ఆనాడు ఆవేశపడ్డారు? ఇప్పుడెందుకు తగ్గిపోయారని వైసీపీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా తెచ్చినందుకు కేంద్రం మంత్రి వెంకయ్య నాయుడుకి శనివారం విజయవాడలో అభినందన సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ అభినందన సభలో ప్యాకేజీ వల్ల ఏపీకి కలిగే లాభాలతో పాటు జై ఆంధ్ర ఉద్యమంలో తన పాత్ర, ప్యాకేజీపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై తనదైన శైలిలో స్పందించారు.
వెంకయ్య నాయుడిని విజయవాడలో సన్మానించడంపై ప్రత్యేక హోదా సాధన సమాఖ్య గౌరవాధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్యాకేజీ తెచ్చినందుకు సన్మానాలు చేసుకోవడం ప్రత్యేక హోదాకు తూట్లు పొడవడమేనని అన్నారు.
వేలాది మంది కార్యకర్తల మధ్య సన్మానం జరుపుకోవడం శోచనీయమని తెలిపారు. వెంకయ్యనాయుడికి అవాస్తవాల వెంకయ్య అని బిరుదు ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి హోదాపై మాట మార్చిన ఘనత వెంకయ్యకే చెల్లిందని ఆయన అన్నారు.
ప్రత్యేక హోదా కాకుండా కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ లాభం చేస్తోందని వెంకయ్య చెప్పిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. ప్రత్యేక హోదా కోసం నిరసనలు తెలుపుతున్నవారిని నిర్బంధిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం చేస్తోన్న ఈ చర్యలను తాము ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.
వెంకయ్యకు సన్మానంపై వైసీపీ నేత పార్థసారధి
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చినందుకు కేంద్రమంత్రి వెంకయ్యకు విజయవాడలో సన్మానం చేసిన అంశంపై వైసీపీ నేత పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాను చంపిన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారా? అందుకే సన్మానాలు చేసుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
ఆనాడు పార్లమెంటులో వెంకయ్య ప్రత్యేక హోదా కోసం ఎందుకు అంతగా ఆవేశపడ్డారు? ఇప్పుడెందుకు తగ్గిపోయారు? అని ఆయన దుయ్యబట్టారు. ఐదు కోట్ల మంది ప్రజలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారని, నిరుద్యోగ యువత హోదా కోరుకుంటున్నారని పార్థసారధి అన్నారు.
వెంకయ్యకు చేసిన సన్మాన కార్యక్రమంలో బీజేపీ నేతలతో పాటు టీడీపీ కూడా పాల్గొందని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజల అకాంక్షలను నాశనం చేశారని, అందుకే వెంకయ్యకు సన్మానం చేశారని ఆయన అన్నారు. ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారని ఆశించామని, ఆశలన్నీ నిరాశలయ్యాయని పేర్కొన్నారు.