మన విడివిడి ఉద్యమాలు చూసి...ఢిల్లీనేతలు నవ్వుతున్నారు:చలసాని
విజయవాడ,విశాఖపట్టణం:ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ కోసం ప్రత్యేక హోదా ఉద్యమ సాధన సమితి నాలుగేళ్లుగా పోరాడుతోందని విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ చెప్పారు.
ఆదివారం విజయవాడలో ప్రత్యేక హోదా ఉద్యమ సాధన సమితి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చలసాని మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎపి ప్రజలు,పార్టీలు, సంఘాలు వేర్వేరుగా ఉద్యమాలు చేయడం చూసి ఢిల్లీ నేతలు నవ్వుతున్నారని వాపోయారు. అందుకే ఇకనైనా అందరం కలిసి ఉద్యమిద్దామని చలసాని పిలుపు ఇచ్చారు.
ప్రత్యేక హోదా ఉద్యమ సాధన సమితి ఆధ్వర్యలో జూన్ 15 తర్వాత విద్యార్థి సంఘాలతో కలిసి కాలేజీల్లో చైతన్య సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. జులైలో బస్సుయాత్ర, వర్సిటీల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని, నెలలో ఒకరోజు ర్యాలీలు, జాతీయ రహదారుల దిగ్బంధం చేస్తామని చలసాని శ్రీనివాస్ వెల్లడించారు. ఎపికి ప్రత్యేక హోదా సాధించే వరకు తమ పోరాటం ఆగదని చలసాని స్పష్టం చేశారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీల అమలుపై బీజేపీ నేతలు చర్చకు రావాలని విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఏపీ బీజేపీ నేతలు రాష్ట్ర హక్కుల కోసం పోరాడాలని, లేని పక్షంలో ద్రోహులుగా మిగిలిపోతారని అన్నారు. విశాఖపట్టణంలో సమావేశం అయిన విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు ఈ సందర్బంగా ద్రోహులకు సూటి ప్రశ్నలు అనే పేరుతో సిద్దం చేసిన వాల్ పోస్టర్ ను విడుదల చేశారు.
ఎపికి అన్యాయం చేసిన కాంగ్రెస్ను రాష్ట్రంలో ఎలా అయితే బంగాళాఖాతంలో తొక్కేశామో...అదేవిధంగా తెలుగు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చక పోయినట్లయితే బీజేపీని కూడా అదే బంగాళాఖాతంలో కలిపేయాలని విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు ప్రజలకు పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో భూస్థాపితం అయిపోయిందని, బీజేపీకి కూడా అదే గతి పడుతుందని ప్రతినిధులు హెచ్చరించారు. ఇప్పటికయినా బీజేపీలో ఉన్న తెలుగు నేతలు ఆ పార్టీలోనే ఉండి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పోరాడాల్సిన అవసరం, బాధ్యత ఉందని విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు పునరుద్ఘాటించారు.