ఛలో అమలాపురం: బీజేపీ నేతలపై కేసులు, నిర్భందాలు, జగన్ సర్కార్పై సోమువీర్రాజు ఫైర్
ఏపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మండిపడ్డారు. ఆలయాలపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అంతేకాదు దాడులు జరిగిన ఆలయాలకు వెళ్లినవారిపై కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తీరు మార్చుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ వ్యతిరేక చర్యలపై తమ పోరాటం కొనసాగుతోందని స్పష్టంచేశారు.
ఛలో అమలాపురం కార్యక్రమాన్ని శుక్రవారం రోజున చేపడుతామని సోము వీర్రాజు స్పష్టంచేశారు. ఛలో అమలాపురం కార్యక్రమాన్ని ప్రకటించలేదని.. కానీ ప్రభుత్వం మాత్రం వాలంటీర్ల ద్వారా గ్రామాల్లోని బీజేపీ నేతలు, కార్యకర్తల వివరాలను సేకరిస్తోందని తెలిపారు. అందుకోసమే తాను ఛలో అమలాపురం కార్యక్రమాన్ని ఛాలెంజ్గా తీసుకున్నానని తెలిపారు. వాస్తవానికి తాము ప్రకటించకున్నా.. ప్రభుత్వం రెచ్చగొట్టే ధోరణి అవలంభిస్తోందని చెప్పారు. ఆలయాలను పరిరక్షించడంపై రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
ఆలయాలపై జరుగుతున్న దాడులను నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళిన వారిపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేయడం దారుణమన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా 5 పార్లమెంటులో ఉన్న బీజేపీ నేతలు ఉదయం 10 గంటల వరకు తరలిరావాలని సోము వీర్రాజు పిలుపునిచ్చారు. ఆలయాలపై దాడులు జరుగుతున్నా..కేసులు నమోదు చేయకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
బీజేపీ నేతలను పోలీసుల గృహనిర్బంధం చేయడం సరికాదన్నారు. సెక్షన్ 30 అమల్లో ఉందని చెప్పి బెదిరించడం సరికాదన్నారు. పార్టీలపై ప్రభుత్వం అణచివేత వైఖరి అవలంభిస్తోందని సోము వీర్రాజు అన్నారు. అంతర్వేది ఘటనలో పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్తో చలో అమలాపురానికి పిలునిచ్చామని సోము వీర్రాజు తెలిపారు.