టీటీడి పాలక మండలి సభ్యుల ఎంపిక షురూ..! బోర్డ్ మెంబర్ గా మై హోమ్ రామేశ్వర రావుకు ఛాన్స్..!!
అమరావతి/హైదరాబాద్ : సుప్రసిద్ద తిరుమల తిరుపతి దేవాలయంలో కొత్త పాలక మండలి ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ముందుగా పాలక మండలి ఛైర్మన్ గా మాజీ ఎంపి, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు వైవీ సుబ్బారెడ్డిని నియమించారు. ఇప్పుడు తాజాగా పాలక మండలి సభ్యులను నియమించేందుకు సన్నాహాలు చేస్తోంది ఏపి ప్రభుత్వం. మొత్తం 16మంది పాలక మండలి సభ్యుల్లో తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణతో పాటు ఏపి నుండి సభ్యులకు ప్రాతినిద్యం కల్పిస్తుంటారు.అందుకసం రాజకీయ పార్టీల నుండి పెద్ద ఎత్తున పైరవీలు ఉండడం గమనార్హం. గతంలో ఈ పైరవీలను తట్టుకోలేక చంద్రబాబు నాయుడు సుమారు ఏడాది పాటు పాలక మండలిని పునరుద్దరించని సందర్బాలు కూడా ఉన్నాయి. ఇలంటి ఒత్తిడే తాజాగా ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా తెలంగాణ నుంచి ప్రముఖ పారిశ్రామిక వేత్త, తెలంగాణ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన మైహోమ్ రామేశ్వర రావుకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడుగా ఏపి సీఎం జగ్ మోహన్ రెడ్డి నియమించినట్టు తెలుస్తోంది. రామేశ్వర రావు పేరును చంద్రశేఖర్ రావు ప్రతిపాదించగా జగన్ అంగీకరించినట్టు సమాచారం. ఇంకా సభ్యులు ఎంపిక కావాల్సి ఉంది. తమిళనాడు నుంచి శేఖర్ రెడ్డి కూడా మళ్లీ బోర్డ్ సభ్యత్వ పదవిని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల అంశంలో వివాదాలు చెలరేగడంతో శేఖర్ రెడ్డిని గత ప్రభుత్వం బోర్డ్ మెంబర్ గా తొలగించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్ గా మాజీ ఎంపీ వైవీ. సుబ్బారెడ్డిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా టీటీడీ ఛైర్మన్ పదవికి సుధాకర్ యాదవ్ రాజీనామా చేయడంతో ఏపీ ప్రభుత్వం నూతన నియామకం చేపట్టింది. త్వరలోనే బోర్డు సభ్యులను నియమించే అవకాశం ఉంది. శనివారం నాడు సుబ్బారెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు.