ఈఎస్ఐ స్కామ్ : పితాని కుమారుడి అరెస్టుకు రంగం సిద్దం? హైదరాబాద్కు స్పెషల్ టీమ్?
రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ఈఎస్ఐ స్కామ్కి సంబంధించి మరో అరెస్టుకు రంగం సిద్దమైందా..? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే సమాధానమే వ్యక్తమవుతోంది. ఈఎస్ఐ కేసులో ఇప్పటికే అరెస్టయిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడి ప్రమేయానికి సంబంధించి ఏసీబీ ఆధారాలు సంపాదించినట్లు తెలుస్తోంది. దీంతో ఏ క్షణమైనా పితాని కుమారుడిని అరెస్టు చేయవచ్చునన్న ప్రచారం జరుగుతోంది.
విచారించకుండా అరెస్ట్ చేయడం ఏంటీ..? ఏసీబీ తీరుపై మాజీమంత్రి పితాని సత్యనారాయణ గుర్రు
పితాని కుమారుడు వెంకట సురేష్ ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అరెస్టు భయం పట్టుకుంది కాబట్టే ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారన్న వాదన వినిపిస్తోంది. హైకోర్టు మాత్రం దాన్ని రిజర్వ్లో పెట్టింది. దీంతో సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లగా... హైదరాబాద్లో అతని ఆచూకీని ఏసీబీ గుర్తించినట్లు తెలుస్తోంది. అతన్ని పట్టుకునేందుకు ఏసీబీ ఓ ప్రత్యేక బృందాన్ని ఇప్పటికే హైదరాబాద్ పంపించిందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో సురేష్ అరెస్ట్ ఖాయమేనన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు తర్వాత పితాని సత్యనారాయణ కార్మిక మంత్రిగా పనిచేశారు. అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఈఎస్ఐ స్కామ్... ఆ స్థానాన్ని పితాని భర్తీ చేశాక కూడా కొనసాగిందన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట సురేష్ దీని వెనకాల కీలకంగా వ్యవహరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈఎస్ఐలో కాంట్రాక్టుల్లో సురేషే చక్రం తిప్పాడని... టెండర్ల కేటాయింపుల్లో ఆయనదే తుది నిర్ణయమన్న ఆరోపణలున్నాయి.
ఏ పని కావాలన్నా 10 శాతం కమిషన్లు తీసుకునేవాడన్న ఆరోపణలుకూడా ఉన్నాయి. ఇదే వ్యవహారానికి సంబంధించి పితాని పీఎస్ మురళీమోహన్ను ఏసీబీ శుక్రవారం(జూలై 10) అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సచివాలయంలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. మురళీమోహన్ అరెస్టుతో తదుపరి టార్గెట్ పితాని కుమారుడే అన్న ప్రచారం ఊపందుకుంది.