ఇటు జగన్ ఫిర్యాదు: అటు టిడిపిలో బాషా చేరిక, 29న గొట్టిపాటి రవి
విజయవాడ: ఫిరాయింపులపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్కు ఫిర్యాదు చేస్తున్న సమయంలోనే అటు విజయవాడలో అనంతపురం జిల్లా కదిరి శానససభ్యుడు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన శనివారం టిడిపిలో చేరారు.
చాంద్బాషాతో పాటు మరికొందరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు, కార్యకర్తలు టిడిపిలో చేరారు. చాంద్బాషాతో కలిపి ఇప్పటి వరకూ 13 మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరారు. మరో ఎమ్మెల్యే కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వబోతున్నారు.
ప్రకాశం జిల్లా అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవి కుమార్ ఈ నెల 29వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన శనివారంనాడు సంతమగులూరులో కార్యకర్తలు, అభిమానులతో సమావేశమయ్యారు.
ఇదిలావుంటే, బాషా తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానసభ్యులు ఆందోళనకు దిగారు. బాషా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాగా, ప్రకాశం జిల్లాకు చెందిన మరో ముగ్గురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు కూడా టిడిపిలో చేరనున్నట్లు ప్రచారం సాగుతోంది.