జగన్కు మరో షాక్: టీడీపీలోకి చాంద్ బాషా, లోకేష్ పాత్రే కీలకం
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరో ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా 50 వాహనాల్లో కార్యకర్తలు, నేతలతో కలిసి విజయవాడకు బయల్దేరినట్లు తెలిసింది.
ఈ సమాచారం అందుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఆయన్ని బుజ్జగించేందుకు హైదరాబాద్ నుంచి బయల్దేరినట్లు సమాచారం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు.. ఎమ్మెల్యే బాషాను సంప్రదించేందుకు ఫోన్ చేయగా.. అతని ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చినట్లు తెలిసింది.
గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన చాంద్ బాషా ఎన్నికల ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలుపొందారు.
తాజాగా, కొద్ది రోజుల క్రితం, చాంద్ బాషా సోదరులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను కలిసి పార్టీలో చేరికపై చర్చించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే చాంద్ బాషా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
కాగా, శుక్రవారం సాయంతరం చాంద్ బాషా తన అనుచరులతో విజయవాడకు పయనమయ్యారు. ఆయనతోపాటు సుమారు 20మంది కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, స్థానిక నేతలు వెళ్లినట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు కిందిస్థాయి నేతల ఒత్తిడి కూడా ఉందని సమాచారం.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి వరుసగా షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే 12మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరగా.. చాంద్ బాషా చేరికతో ఆ సంఖ్య 13కు చేరనుంది. కాగా, శనివారం చాంద్ బాషా.. టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది.