రాహుల్కు చంద్రబాబు గుడ్ బై..మోదీ కోసమేనా: మరి..ఎన్డీఏతో జగన్..!: నేడు తేల్చేస్తారా..!
టీడీపీ అధినేత చంద్రబాబు మరో కీలక నిర్ణయం. ఎన్నికల వరకూ రాహుల్కు రాజకీయంగా అన్నీ తానై వ్యవహరించి న చంద్రబాబు ఇప్పుడూ దూరంగా ఉండాలని నిర్ణయించారు. యూపీఏ..ఎన్డీకు సమ దూరం పాటించాలని పార్టీ ఎంపీ లకు దిశా నిర్ధేశం చేసారు. సందర్భానుసారం నడుచుకుందామని హితబోధ చేసారు. ప్రత్యేక హోదా బాధ్యత వైసీపీ ఎంపీలదే అని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి జగన్ భేటీ అవుతున్నారు. సఖ్యతగా ఉంటూనే హోదా సాధించాలని చెబుతున్న జగన్...మరి, కేంద్ర ప్రభుత్వం విషయంలో ఏం చెబుతారనేది ఆసక్తిగా మారింది.
రాహుల్తో చంద్రబాబు దూరం...
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు..కేంద్రంలో మోదీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నంత కాలం ఒక్కటిగా ఉన్నారు. ఇక, మోదీతో రాజకీయంగా విభేదాలు వచ్చిన తరువాత చంద్రబాబు ఊహించని విధంగా నేరుగా కాంగ్రెస్ అధినేత రాహుల్ ఇంటికి వెళ్లి మరీ స్నేహ హస్తం అందించారు. తెలంగాణ ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేసారు. జాతీయ రాజకీయాల్లోనూ మోదీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలను ఒకే తాటి మీదకు తెచ్చే ప్రయత్నం చేసారు. ఒక రకంగా రాహుల్కు నాడు ఎన్నికల ముందు రాజకీయంగా అన్నీ తానై వ్యవహరించారు. సోనియా వద్దకు వెళ్లారు. తిరిగి మోదీ ప్రధాని కాకుండా అడ్డుకోవటమే లక్ష్యం అని చాటారు. ఎన్నికలు ముగిసిన తరువాత కూడా రాహుల్ను ప్రధాని చేయాలని మనసులో ఉన్నా..అందరినీ కలిపే ప్రయత్నంలో మనసులో మాట బయట పెట్టలేదు. ఇక..బీజేపీ అధికారం కోల్పోవటం ఖాయం ..తాను మరోసారి ఢిల్లీలో చక్రం తిప్పవచ్చని ఆశించారు. కానీ, ఫలితాలు ఆయన అంచనాలను తారు మారు చేసాయి. దీంతో..ఇప్పుడు యూపీఏ తో దూరంగా ఉండాలని నిర్ణయించారు.
మోదీ కోసమేనా...
టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ పరిణామాలకు అనుగుణంగా తన నిర్ణయాలు మార్చుకోవటంలో దిట్ట. ఇప్పుడు మరో సారి అదే స్పష్టం చేసారు. కేంద్రంలో మోదీ తిరిగి అధికారంలోకి రావటంతో ఇప్పటికే వ్యక్తిగతంగా తన పైన ఆగ్రహంగా ఉన్న మోదీకి తాను ఇప్పటికిప్పుడే దగ్గర కాలేకపోయినా..రాహుల్తో మాత్రం తాను లేనని సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే..పార్టీ ఎంపీల సమావేశంలో యూపీఏ - ఎన్డీఏలకు సమ దూరం పాటిం చాలని సూచించారు. సందర్భానుసారం..అంశాల వారీగా ఎప్పుడు ఎలా వ్యవహరించాలో నిర్ణయం తీసుకుందామని స్పష్టం చేసారు. అదే సమయంలో ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు పోరాటం చేయాల్సిందేనని..మన బాధ్యతను మనం కొనసాగిద్దామని చెప్పుకొచ్చారు. అయితే, రాజకీయంగా తిరిగి టీడీపీని నిలబెట్టుకోవాలంటే జాతీయ స్థాయిలో మోదీకి తిరిగి దగ్గరవుతారనే అంచనాలు టీడీపీలో వినిపిస్తున్నాయి. మరి..మోదీ-షా అంగీకరిస్తారా లేదా చూడాలి.
జగన్ ఏం చెబుతున్నారు..
ఇదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సైతం తన పార్టీ ఎంపీలతో సమావేశం అవుతున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉ న్న జగన్ ఏపీ భవన్లో ఎంపీల సమావేశం ఏర్పాటు చేసారు. అటు యూపీఏ..ఇటు ఎన్డీఏతో సమదూరం పాటించాలని చంద్రబాబు నిర్ణయించిన నేపథ్యంలో జగన్ తన ఎంపీలకు ఏం సూచిస్తారనేది ఆసక్తి కరంగా మారింది. ఎన్నికల ముందు నుండీ జగన్ తటస్థంగానే ఉన్నారు. అయితే, ఫలితాల తరువాత మోదీతో సన్నిహితంగా ఉంటున్నారు. ఇదే సమయంలో ప్రత్యేక హోదా బాధ్యత జనత్ పైన ఉంది. దీనిని సఖ్యతతో ఉండి సాధించుకోవాల్సిందేనని జగన్ ఇప్పటికే స్పష్టం చేసారు. ఈ పరిస్థితుల్లో పార్టీ ఎంపీలకు హోదా విషయంలో ఏం చెబుతారు..ప్రభుత్వంతో ఎలా వ్యవహరించాలని సూచిస్తారనేది ఆసక్తి కరంగా మారింది. కేంద్రంతో రాజకీయంగా దూరంగా ఉంటూనే..స్నేహం మాత్రం కొనసాగించాలనేది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది.