అవి రెండూ చంద్రబాబుకు ఇష్టం లేదు:కన్నా, టిడిపికి బొత్సా కౌంటర్
విశాఖపట్నం: రాష్ట్రానికి కడప స్టీల్ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు రావడం సిఎం చంద్రబాబుకు ఇష్టం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి రావాల్సిన నిధులు కేంద్రం ఇస్తోందని చెప్పారు.
టీడీపీ అన్ని అంశాలపై రాజకీయం చేస్తోందని కన్నా మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని కులాలను చంద్రబాబు మోసం చేశారని ఆయన విమర్శించారు. చంద్రబాబు మోసం చేయడానికి ఇప్పుడు ఇక ఏ కులం లేదన్నారు. చంద్రబాబు కేంద్రాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని...వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వాస్తవాలను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కళ్లారా చూశారన్న టిడిపి నేతల వ్యాఖ్యలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గట్టి కౌంటర్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్లో జరుగుతున్న అక్రమాలను నితిన్ గడ్కరీ కళ్ళారా చూశారని, ఈ ప్రాజెక్ట్ లో అక్రమాలు జరిగిన సంగతి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటనలో బహిర్గతమయ్యాయన్నారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతోందన్నారు.
పట్టిసీమ ప్రాజెక్టు కోసం పోలవరాన్ని పక్కన బెట్టారని ఆరోపించారు. ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు. డీపీఆర్లలో ఎందుకు వ్యత్యాసాలు వస్తున్నాయో ప్రజలకు చెప్పాలన్నారు. పోలవరం పనుల్లో కమీషన్ల కోసమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాకులాడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా బీజేపీ, టీడీపీలు డ్రామాలు కట్టిపెట్టాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్పై కేంద్రం డెడ్లైన్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
Recommended Video
అంతకుముందు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులో వాస్తవాలను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కళ్లారా చూశారని చెప్పారు. పేపర్లపై చూడటం వేరు, ప్రత్యక్షంగా చూడటం వేరని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీ గడ్కరీకి కనిపించిందని చెప్పారు. ఇతర కేంద్రమంత్రులు కూడా పోలవరాన్ని సందర్శించాలన్నారు. పోలవరం వివరాలను గడ్కరీ కేంద్రానికి తగిన విధంగా వివరించాలని ఎంపి మురళీ మోహన్ అన్నారు. నిధుల కొరత లేకుండా త్వరగా పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేలా చూడాలన్నారు. గడ్కరీ కితాబుతో ప్రతిపక్ష నేతలు నోరు మూసుకోవాలి అని ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు.