ఏపీ రాజకీయ పరిణామాలపై టీడీపీ ఫోకస్ .. సీనియర్లతో చంద్రబాబు భేటీ
అమరావతి : ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తోన్న వేళ .. రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అధికార టీడీపీ, విపక్ష వైసీపీతో పాటు జనసేన పార్టీలు తమ అస్త్రాలకు మరింత పదునుపెట్టాయి. దీంతో సమయం దొరికినప్పుడల్లా విపక్ష వైసీపీతోపాటు జనసేన పార్టీ వైఖరిని ఎండగడుతూనే ఉన్నారు చంద్రబాబు.
సీనియర్లతో భేటీ ..
వరుసగా జరుగుతున్న రాజకీయ పరిణామాలతో పార్టీ సీనియర్లతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో వచ్చే ఎన్నికలే ప్రధాన అంశంగా చర్చిస్తోన్నారు. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మేనిఫెస్టో కమిటీ వేసి మిగతా పార్టీల కన్నా ముందు ఉన్న టీడీపీ ... అభ్యర్థులను కూడా ప్రకటించాలని ఆలోచిస్తోంది. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రకటించిన మాదిరిగా 120 స్థానాలకు అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ అంశంపై కూడా సమావేశంలో చర్చ వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు జెండా పండుగ నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టంచేయనుంది.
ఏం చేద్దాం ...
ఏపీలో అధికారం చేపట్టేందుకు విపక్ష వైసీపీ ఉవ్విళ్లూరుతోంది. ఇందుకు తగ్గట్టుగానే దాని యాక్షన్ ప్లాన్ ఉంటుంది. ఈ నేపథ్యంలో .. వైసీపీ, టీఆర్ఎస్ పై ఎదురుదాడికి దిగారు చంద్రబాబు. హైదరాబాద్ లో ఆస్తులున్న టీడీపీ నేతలను వైసీపీలో చేరాలని టీఆర్ఎస్ సర్కార్ బెదిరిస్తోందని ఆరోపించారు. దీంతోపాటు జగన్ తో నాగార్జున భేటీ .. ఇతర పారిశ్రామిక వేత్తల సమావేశం అంశాన్ని కూడా సీరియస్ గా తీసుకున్నారు. వారి సమావేశంతో ప్రజల్లో సానుకూలత వచ్చి .. వైసీపీకి మేలు చేస్తుందనే భావన టీడీపీ వర్గాల్లో నెలకొంది. ఈ క్రమంలో మొగ్గ దశలోనే వాటిని ఖండించి .. తమకు అనుకూలంగా మలచుకోవాలనేది చంద్రబాబు వ్యుహంగా తెలుస్తోంది.
సంక్షేమమే శ్రీరామరక్ష
ఇప్పటివరకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్రుతంగా తీసుకెళ్లాలని శ్రేణులకు సూచిస్తున్నారు చంద్రబాబు. దీంతో తమ ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలు గుర్తిస్తారని చెప్తున్నారు. నాలుగున్నరేళ్లలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమ పాలిట శ్రీరామరక్ష అవుతాయని .. వాటిని ప్రజల్లో తిరుగుతూ ప్రచారం చేసుకోవాలని సూచిస్తున్నారు.
వలసలపై మథనం ..
మొత్తంగా ఏపీ రాజకీయాలను ప్రభావితం చేసే అన్ని అంశాలకు కౌంటర్ స్ట్రాటజీ అప్లై చేయాలని చంద్రబాబు ప్రణాళిక రచిస్తున్నారు. ఇందుకోసం టీడీపీ శ్రేణులు, నేతలు, కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నారు. దీంతోపాటు వలసలపై కూడా ఫోకస్ చేశారు. ఇటీవలే పార్టీ వీడిన ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్ తదితర నేతలు పార్టీ వీడటంపై .. అలాగే పార్టీలో చేరికపై కూడా ద్రుష్టిసారించారు. ఒక నేత పోయిన ఫరవాలేదని .. తనకున్న కార్యకర్తలనే నేతలుగా తీర్చిదిద్దుతామని స్పష్టంచేస్తున్నారు చంద్రబాబు.