గన్నవరం ఎయిర్పోర్టులో చంద్రబాబుకు అవమానం ... తనిఖీలపై మాజీ మంత్రి చినరాజప్ప ఫైర్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు గన్నవరం ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. చంద్రబాబును ఒక సాధారణ పౌరుడిలా తనిఖీలు చేయడం, ఆయన వాహనాలను లోనికి అనుమతించలేదు , దీనితో టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని గన్నవరం విమానాశ్రయంలో సాధారణ ప్రయాణికుడిలా తనిఖీలు చేయడంపై మాజీ మంత్రి చినరాజప్ప స్పందించారు. విమానాశ్రయ సిబ్బంది తీరును తప్పుబట్టారు. వీఐపీ, జడ్ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబును తనిఖీలు చేయడం దారుణమన్నారు చిన రాజప్ప . విమానాశ్రయంలో ఆయనకు ప్రత్యేక వాహనాన్ని కేటాయించకపోవడంపైనా మాజీ హోంమంత్రి చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు సాధారణ ప్రయాణీకులతో పాటు ప్రయాణించారు.
చంద్రబాబు భద్రతను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని, అందులో భాగంగానే ఇలా సామాన్య ప్రయాణికుల్లా తనిఖీలు చేసి, ప్రయాణికుల బస్సులో పంపించారని చినరాజప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు భద్రత ను కూడా తగ్గించిందని ఆగ్రహం వక్తం చేస్తున్న టీడీపీ నాయకులు , ఇప్పుడు ఎయిర్ పోర్ట్ లో సైతం కావాలనే చంద్రబాబు నాయుడిని అవమానించారని ప్రభుత్వం కక్ష పూరితంగా మాజీ ముఖ్యమంత్రిని అవమానించే పని చేస్తుందని మండిపడుతున్నారు .
అయితే నిబంధనల ప్రకారమే తనిఖీలు చేశారని ఇందులో చంద్రబాబుని అవమానించినది ఏదీ లేదని ప్రతి పక్ష నేతకు ప్రత్యేకమైన ప్రోటోకాల్ ఉండదని విమానయాన శాఖ తేల్చి చెప్పింది. ఇక దీనిని టిడిపి నేతలు కావాలని రాజకీయం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జగన్ కు కూడా ఇదే తరహాలో తనిఖీలు చేశారని, జగన్ కూడా సాధారణ ప్రయాణికుడిలానే ప్రయాణం చేశారని వైసిపి పేర్కొంటుంది.కానీ చంద్రబాబులా జగన్ ప్రతీదీ రాద్దాంతం చెయ్యలేదని వైసీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు ఇప్పుడు సీఎం కాదని, నిబంధనల మేరకే తనిఖీలు చేశారని చెప్తున్నారు.