రాహుల్ కంటే బాబు బెటర్: ప్రధాని పదవి పైన చర్చ: ఏపిలో ఎంపీ సీట్లే కీలకం..!
ఏపిలోనే కాదు..జాతీయ స్థాయిలోనూ ఎన్నికల ఫలితాల పైన ఆసక్తి నెలకొని ఉంది. ఇక, తాజాగా ఎన్డీఏ అధికారంలోకి రాకుంటే రాహల్ ప్రధాని అవుతారనే ప్రచారాన్ని కొంత మంది మిత్రపక్ష నేతలే ఖండిస్తున్నారు. రాహుల్ కంటే ఏపి సీయం చంద్రబాబు బెటర్ అని వ్యాఖ్యానిస్తున్నారదు. అయితే, ఏపిలో టిడిపి దక్కించుకొనే లోక్సభ సీట్లు ఢిల్లీలో.. అసెంబ్లీ సీట్లు ఏపిలో కీలకంగా మారనున్నాయి. మరి..చంద్రబాబు ఏం చేస్తారు..
రాహుల్ కంటే బాబు బెటర్..
ప్రధాని పదవికి రాహుల్ గాంధీ కంటే టీడీపి అధినేత చంద్రబాబు ఉత్తమమని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ప్రతిపక్షాల నుంచి ప్రధాని అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సి వస్తే బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ, బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుల అర్హత గలవారని ఆయన వ్యాఖ్యానించారు. మాయావతి, మమత బెనర్జీ లేదంటే చంద్రబాబు.. ఎన్డీయేతర పక్షాల నుంచి ప్రధానమంత్రి అభ్యర్థిని ఎంచుకోవాల్సి వస్తే వీరు ముగ్గురూ అర్హులే. కాంగ్రెస్ అధినేత రాహుల్ కంటే వీరిని ఎంచుకోవడమే ఉత్తమం అని వ్యాఖ్యానించారు. ఎన్డీయేకు వ్యతిరేకంగా ఏర్పడబోయే కూటమిలో ఎన్సీపీ కింగ్మేకర్ పాత్ర పోషించనున్నట్లు చెప్పుకొచ్చారు. ఎన్నికల తర్వాత ఎన్డీయేలోని కొన్ని పార్టీలతో కూటమి ఏర్పాటు చేయనున్నట్లు పవార్ చెప్పుకొచ్చారు.
ఏపిలో ఫలితాలే కీలకం..
జాతీయ స్థాయిలో బాబు ప్రధాని అభ్యర్దిగా అర్హుడని నాడు దేవగౌడ..నేడు శరద్ పవర్ వ్యాఖ్యానించారు. అయితే, ఏపి ఎన్నికల ఫలితాలు ఇప్పుడు చంద్రబాబుకు కీలకంగా మారాయి. ఏపిలో గెలిచి పార్టీని మరోసారి అధికారంలోకి తేవటం ద్వారా ఇక భవిష్యత్లో తిరుగు లేకుండా చేసుకోవటం ఆయన ముందున్న ప్రధాన లక్ష్యం. అదే సమయంలో ఇక్కడ ఫలితాలు వ్యతిరేకంగా ఉంటే..టిడిపికి వచ్చే ఎంపీ సీట్లు చంద్రబాబును జాతీయ రాజకీయాల వైపు తీసుకెళ్లే చాన్స్ కనిపిస్తోంది. ఏపిలో కనీసం పదికి పైగా లోక్సభ సీట్లు టిడిపికి దక్కించుకుంటే జాతీయ స్థాయిలో చంద్రబాబు కీలక పాత్ర పోషించే అవకాశం దక్కుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, ప్రధాని పదవి ఆశిస్తున్న మమతా , మాయావతి లాంటి వారు పెద్ద సంఖ్యలో సీట్లు దక్కించుకుంటే వారిదే మోదీ వ్యతిరేక కూటమిలో కీలకం అవుతారు. వారి నిర్ణయాలకు అనుగుణంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది.
ఢిల్లీలో జగన్ ప్రభావం ఏ రకంగా..
ఇక, చంద్రబాబు ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఏపిలో అధికారం దక్కితే ఇక్కడ..లేకుంటే జాతీయ స్థాయిలో చంద్రబాబు క్రియా శీలకంగా వ్యవహరించే అవకాశం కొట్టి పారేయలేమని టిడిపి నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో..వైసిపి అధినేత జగన్ సైతం పెద్ద సంఖ్యలో ఎంపి సీట్లు సాధించి జాతీయ స్థాయిలో వైసిపికి ప్రాధాన్యత పెరిగేలా చూడాలని ఆశిస్తున్నారు. చంద్రబాబు కీ రోల్ పోషిస్తున్న యుపిఏ కూటమికి జగన్ మద్దతిచ్చే అవకాశాలు ఉండవు. ఇక, చంద్రబాబు వ్యతిరేక కూటమికే జగన్ మద్దతు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఏపిలో టిడిపిని ఈ ఎన్నికల్లో దెబ్బ తీస్తామనే నమ్మకంతో ఉన్న జగన్..భవిష్యత్లో పూర్తి ఆధిపత్యం సాధించే దిశగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అయితే, చంద్రబాబు ..జగన్ ఈ ఇద్దరి లక్ష్యాలు ఏ మాత్రం ముందుకు వెళ్లాలన్నా..అది ఏపి ఫలితాల ఆధారంగానే ఉండే అవకాశం ఉంది.