ఆపరేషన్ గరుడ సృష్టికర్త చంద్రబాబే...పవన్పై కూడా దాడికి కుట్ర:కన్నా సంచలన ఆరోపణలు
గుంటూరు:ఆత్మహత్య చేసుకునే వ్యక్తి సూసైడ్ నోట్ రాసుకోవడం చూశాం గానీ...హత్య చేసే వ్యక్తి లేఖ రాయడం టీడీపీ ప్రభుత్వంలోనే చూస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. జగన్ పై దాడి గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు.
గుంటూరులో కన్నా మీడియాతో మాట్లాడుతూ...అసలు ఆపరేషన్ గరుడ సృష్టికర్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఆరోపించారు. ఓ సినిమా యాక్టర్ చెప్పిన వాటిని చదివే స్థాయికి ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజారిపోయారని కన్నా ఆరోపించారు. ఆ సినిమా నటుడిని తక్షణమే అరెస్ట్ చేసి కుట్రలు బయటపెట్టాలని కన్నా డిమాండ్ చేశారు. సినిమా నటుడు చదివిన స్క్రిప్ట్ అంతా సీఎం చంద్రబాబు రాసిందేనని కన్నా ఆరోపించారు.
చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని కన్నా విమర్శించారు. గతంలో ఏడాది సర్వీస్ ఉన్న ప్రసాద్రావుని తప్పించి...చంద్రబాబు తన బంధువును డీజీపీగా పెట్టుకున్నారని కన్నా చెప్పారు. అయితే ప్రదాని మోడీ...చంద్రబాబులా సీబీఐలో తన బంధువును పెట్టుకోలేదని వ్యాఖ్యానించారు.
అలిపిరిలో దాడి జరిగినప్పుడు చంద్రబాబు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎందుకు ఫిర్యాదు చేయలేదని కన్నా ప్రశ్నించారు. రాష్ట్రంలో అసమర్థ పాలన జరుగుతుంటే గవర్నర్ జోక్యం చేసుకోవడంలో తప్పేమీ లేదని కన్నా వ్యాఖ్యానించారు. ఆత్మహత్య చేసుకునే వ్యక్తి సూసైడ్ నోట్ రాసుకోవడం చూశాం గానీ...హత్య చేసే వ్యక్తి లేఖ రాయడం టీడీపీ ప్రభుత్వంలోనే చూస్తున్నామని కన్నా ఎద్దేవా చేశారు.
జగన్పై జరిగిన దాడిని అందరూ ఖండించారని...మానవ జన్మ ఎత్తిన వారు ఎవరైనా అలాగే ఖండిస్తారని అన్నారు. ప్రతిపక్ష నేత రాష్ట్రంలో ప్రశాంతంగా తిరిగే పరిస్థితి లేదన్నారు. అమిత్ షాపై దాడి చేశారు. అలాగే తనపై కూడా దాడి చేశారన్నారు. పవన్కల్యాణ్పై కూడా దాడికి కుట్రలు చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా ఆరోపించారు.