చంద్రబాబు రైతుమిత్ర అయితే మంగళగిరిలో లోకేశ్ ఎందుకు ఓడిపోయాడు: ఆర్కే
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫైరయ్యారు. రైతు ద్రోహి తాను కాదని.. చంద్రబాబు, లోకేశ్ అని విమర్శించారు. చంద్రబాబు రైతు మిత్ర అయితే మంగళగిరిలో లోకేశ్ను ప్రజలు ఎందుకు ఓడించారని ప్రశ్నించారు. మంగళగిరికి గత ప్రభుత్వం ఏమీ చేయలేదని ప్రజలకు తెలుసు అని గుర్తుచేశారు. అందుకే ఎన్నికల్లో బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వద్దకు తాను తీసుకెళ్లినా రైతుల వివరాలను మీడియా ముందు చదివి వినిపించారు ఆర్కే.
రైతులు, రైతుకూలీలు వీరే..
రాజధాని ప్రాంతంలో భూములు ఉన్న రైతులు, రైతు కూలీల వివరాలను తెలిపారు. 1 ఎకరాల 34 సెంట్ల భూమి ఉన్న పుల్లగుజ్జు వీరయ్య, 2 ఎకరాల 50 సెంట్లు ఉన్న గాదె స్వామిరెడ్డి, 50 సెంట్ల భూమి ఉన్న గాదె లక్ష్మారెడ్డి రైతులు అని వివరించారు. కల్వకొల్లు నాగరాజు రైతుకూలీ అని పెన్షన్ నంబర్ కూడా చెప్పారు. భూములిచ్చిన రైతులను సీఎం వద్దకు తీసుకెళితే.. వారిని పెయిడ్ ఆర్టిస్టులు అని అనడం సరికాదన్నారు.
నయవంచన..
గత ప్రభుత్వం రైతులను, రైతు కూలీలను మోసం చేసిందని ఆర్కే అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతిలో రాజధానిని తీసుకొచ్చారని విమర్శించారు. కానీ మంగళగిరి రైతులు మాత్రం రాజధానికి భూములు ఇచ్చేందుకు సహకరించలేదని గుర్తుచేశారు. కానీ వారిని బెదిరించి, భయపెట్టి భూములు తీసుకోవాలని ప్రయత్నించారని చెప్పారు. తమ తాతల భూములను వదులుకోవడం ఇష్టం లేకపోయినా రైతులు.. కోర్టులను ఆశ్రయించారని తెలిపారు.
ల్యాండ్ పూలింగ్..
రాజధాని కోసం భూములు ఇచ్చేందుకు రైతులు ఒప్పుకోవాలని కోరి తర్వాత ల్యాండ్ పూలింగ్ అని బెదిరించారని ఆర్కే గుర్తుచేశారు. గత్యంతరం లేకే రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించారని పేర్కొన్నారు. అర ఎకరం భూమి ఉన్న వారిని కూడా గత ప్రభుత్వం వదిలేయలేదు అని చెప్పారు. చంద్రబాబు చేసిన అరాచకాలు చూసే.. ప్రజలు బుద్ది చెప్పారని తెలిపారు. కానీ తప్పు మీరు చేసి.. తమపై నెపం నెట్టడం సరికాదన్నారు.
లోకేశ్ను వద్దని చెప్పిన..
లోకేశ్ను మంగళగిరిలో పోటీ చేయించొద్దని కూడా చంద్రబాబుకు సలహా ఇచ్చానని ఆర్కే సూచించారు. అతని భవిష్యత్ నాశనం చేయొద్దని సూచించానని పేర్కొన్నారు. కానీ వినిపించుకోలేదని, తన కుమారుడి రాజకీయ భవిష్యత్ను కూడా ఫణంగా పెట్టారని తెలిపారు. అభవృద్ధి చేస్తే తనపై మంగళగిరిలో పోటీ చేయాలని చంద్రబాబుకు సవాల్ విసిరిన విషయాన్ని గుర్తుచేశారు. ఓడిపోతానని భావించి.. తన కుమారుడిని బరిలోకి దింపారని తెలిపారు.