ఆపరేషన్ గరుడపై డిజిపికి బిజెపి ఫిర్యాదు:బాబును మించిన అవినీతిపరుడు ప్రపంచంలో ఉండరన్న కన్నా
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో దారుణమైన అవినీతి పాలన సాగుతోందని ఎపి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును మించిన అవినీతిపరుడు ఈ ప్రపంచంలో మరెక్కడా ఉండరని ఆయన విమర్శించారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
అమరావతి బాండ్లపై ఏపీ అసెంబ్లీలో వాడీవేడి చర్చ...ఆ పదం రికార్డ్స్ నుంచి తొలగించాలని టిడిపి ఎమ్మెల్యే
టీడీపీ ఓ డ్రామా కంపెనిలాంటిదని, ఆ పార్టీకి సిద్ధాంతమంటూ ఏది లేదని కన్నా ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీపై తెలుగుదేశం పార్టీ నేతలు విష ప్రచారం చేశారని, 2019లో టీడీపీకి ఏపీ ప్రజలే తగిన బుద్ధి చెప్తారని కన్నా చెప్పారు. మరోవైపు ఆపరేషన్ గరుడ ఆరోపణలపై ఎపి బిజెపి నేతలు డిజిపికి ఫిర్యాదు చేశారు.
మూడు నెలల క్రితం 'ఆపరేషన్ గరుడ' కుట్ర అంటూ హల్ చల్ చేసిన సినీ హీరో శివాజీ చెప్పిన తాజాగా చంద్రబాబుకు నోటీసులంటూ మళ్లీ వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడికి త్వరలోనే ఓ కేంద్ర సంస్థ నుంచి నోటీసులు వస్తాయని...ఆ వివరాలు ఎక్కువ చెప్పలేనని, ఇప్పటికే తనకు ప్రాణహాని ఉందని విలేకరుల సమావేశంలో చెప్పడం ఏపీ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశం అయ్యాయి.
అసలు చంద్రబాబుకు ఎందుకు నోటీసులిస్తారు?...అలా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం కేంద్రానికి ఏముంది..?...అసలు శివాజీ చెబుతున్నవన్నీ అబద్ధాలేనా...లేదా వాటిల్లో ఏమైనా వాస్తవం ఉందా అనే విషయం అటు రాజకీయ నేతలే కాదు ఇటు సామాన్య జనంలోనూ చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో బిజెపి చేసిన ఒక పని కూడా ఆ చర్చలో భాగం ఆయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
సినీ నటుడు శివాజీ ఆరోపణల విషయమై తాజాగా బిజెపి నేత, మాజీ మంత్రి మాణిక్యాల రావు స్పందించారు. " ఆపరేషన్ గరుడ అనేది అవాస్తవం...శివాజీతో టీడీపీ నేతలే ఇలా మాట్లాడిస్తున్నారు....ఆపరేషన్ గరుడపై విచారణ జరపాలని డీజీపీని ఏపీ బీజేపీ నేతలు కోరడం జరిగింది...ఆపరేషన్ గరుడ నిజమైతే నిందితులపై చర్యలు తీసుకోవాలని...ఒక వేళ అది అవాస్తవమైతే శివాజీపై చర్యలు తీసుకోవాలని డిజిపిని కోరాము"...అని మాణిక్యాలరావు స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు అనంతరం మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన ఈ విషయాలు వెల్లడించారు.