కడపలో రెండు అనంతపురంలో ఒక పశువును చంద్రబాబు కట్టిపడేశారు: రాచమల్లు తీవ్ర విమర్శలు
Recommended Video
చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను ఎంపీలను పశువుల పాకలో కట్టి పడేశారని ధ్వజమెత్తారు ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద రెడ్డి. చంద్రబాబు పాలనను వ్యతిరేకిస్తూ వంచనపై గర్జన పేరుతో అనంతపురంలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. ఒక వంచన లేదు రెండు వంచనలు పోనీ మూడు వంచనలైతే గుర్తుపెట్టుకుని మాట్లాడవచ్చని, చంద్రబాబు కొన్ని వందల వంచనలకు పాల్పడ్డారని వాటన్నిటినీ గుర్తు పెట్టుకోలేమని అన్నారు.
కడప జిల్లాలో రెండు పశువులను, అనంతపురంలో ఒక పశువును చంద్రబాబు తన పశువుల పాకలో కట్టిపడేశారని తీవ్రస్థాయిలో ప్రసాద రెడ్డి విమర్శించారు. కోట్లకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు తమకు చాలా బాధగా ఉందని చెబుతున్నారని... మరి తమను గెలిపించిన ప్రజలు ఇంకెంత బాధపడి ఉంటారన్న విషయం వారేనాడైనా గుర్తెరిగారా అంటూ ప్రసాదరెడ్డి సూటిగా ప్రశ్నించారు.
నాలుగేళ్లుగా బీజేపీతో జతకట్టిన టీడీపీ చంద్రబాబులు రాష్ట్రంలో చేసినవన్నీ వంచనలే అని రాచమల్లు ధ్వజమెత్తారు. బీజేపీతో స్నేహంగా ఉన్న సమయంలో ఉక్కు ఫ్యాక్టరీ, దుగరాజపట్నం, పోలవరంలాంటివి గుర్తు రాలేదని ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో దొంగ దీక్షలకు తెలుగు దేశం నేతలు తెరదీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్ను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ఆంధ్రరాష్ట్ర ప్రజలపై ఉందన్న రాచమల్లు... అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమేఅన్నారు. విభజన హామీలు నెరవేర్చడం కోసం ఒక్క జగన్ మోహన్ రెడ్డి మాత్రమే నిరంతర పోరాటం చేస్తున్నారన్నారు. తనను నల్ల దుస్తులు ధరించి రావాలని నేతలు చెప్పారని అయితే తాను ఎప్పటి నుంచో నల్ల కండువా ధరించి తిరుగుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు గద్దె దిగిన రోజునే తన భుజం పై నుంచి నల్ల కండువా కూడా దిగుతుందని రెండూ ఒకేరోజు జరుగుతాయని రాచమల్లు చెప్పారు.