ఆ ఆకలి చావులకు సీఎం, జగన్ దే బాధ్యత:పవన్;టిడిపిని సాగనంపాలని...!:జివిఎల్
విశాఖపట్టణం:తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ మూసివేతతో వేల మంది కార్మికులు చనిపోయారని...ఆ కార్మికుల ఆకలి చావులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ బాధ్యత వహించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండో విడత ప్రజా పోరాట యాత్ర జనసేన పోరాటయాత్ర మంగళవారం అనకాపల్లిలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు ఒక్కరోజు నవ నిర్మాణదీక్ష ఖర్చుతో షుగర్ ఫ్యాక్టరీని తెరిపించవచ్చునని అన్నారు. ఉత్తరాంధ్రలో ఎంపీ, ఎమ్మెల్యేలుగా వలస పక్షులను గెలిపించడం వల్ల వాళ్లు స్థానిక సమస్యలపై ఏమాత్రం శ్రద్ధ చూపించడం లేదని పవన్ విమర్శించారు.
విజయనగరం జిల్లాలో జిందాల్, పతాంజలి కంపెనీలకు ఈ విధంగానే భూములు కట్టబెట్టారని, ఆ కంపెనీలు మాత్రం ప్రారంభం కాలేదని తెలిపారు. జనసేన అధికారంలోకి వస్తే కంపెనీల పేరుతో తీసుకున్న భూములను తిరిగిచ్చేందుకు కృషి చేస్తామన్నారు. వీలుపడకపోతే ప్రత్యామ్నాయ భూములను నిర్వాసితులకు అందిస్తామని హామీ ఇచ్చారు. అనకాపల్లిలో అక్రమ క్వారీలతో పర్యావరణానికి ముప్పు ఏర్పడిందని పవన్ కల్యాణ్ చెప్పారు. అనకాపల్లి మరో ఉద్దానంగా మారుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు విజయవాడలో బిజెపి ఎంపి జీవీఎల్ నరసింహారావు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ టిడిపి పై తీవ్ర విమర్శలు చేశారు.ఎపి లోని టిడిపి ప్రభుత్వం తన పాలనా వైఫల్యాలను కేంద్రంపై నెట్టాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. 2016లో ప్రత్యేక ప్యాకేజీ బాగుందన్న సీఎం చంద్రబాబు...ఇప్పుడు ప్రత్యేక హోదా అంటున్నారని, అలా అంటూనే మరోవైపు కేంద్రం ప్యాకేజీ కింద ఇచ్చిన నిధులను మాత్రం వినియోగిస్తున్నారని జివిఎల్ ఆరోపించారు. ప్రత్యేక ప్యాకేజీ కింద రాష్ట్రానికి 5 ప్రాజెక్టులు, రూ. 12,500 కోట్లు నిధులు వచ్చాయని జీవీఎల్ తెలిపారు.