సీఈవో పరిధి దాటారు: ఎన్నికల సంఘానికి ఆ హక్కు లేదు: సీఈసీ కి చంద్రబాబు ఘాటు లేఖ..!
ఏపిలో ఎన్నికల నాటి నుండి ఎన్నికల సంఘంతో నేరుగా తల పడుతున్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా తన అభ్యంతరాలతో నేరుగా కేంద్ర ఎన్నికల కమీషన్ను ఘాటు లేఖ రాసారు. ఏపి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తన పరిధి దాటారని సీయం ఫిర్యాదు చేసారు. తన సమీక్షలను ఆపే హక్కు ఎన్నికల సంఘానికి లేదని పేర్కొన్నారు. వైసిపి ఇచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఇసి దృష్టికి తీసుకొచ్చారు.
సీఈవో పరిధి దాటుతున్నారు..
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తన అధికార పరిధిని దాటుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్కు రాసిని లేఖలో ఫిర్యాదు చేసారు. ముఖ్యమంత్రికి నిఘా చీఫ్ రిపోర్ట్ చేయకూడదని ఆయన నిర్దేశించటం పైన అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ విధంగా ఎన్నికల సంఘం నిబంధనల్లో ఎక్కడ ఉందని ప్రశ్నించారు. కేంద్రం లో ఐబి చీఫ్ ఏవిధంగా అయితే ప్రధాని కి నివేదిస్తారో అదే విధంగా రాష్ట్రంలో ఇంటలిజెన్స్ చీఫ్ ముఖ్యమంత్రికి పరిస్థితులను అందిస్తారని వివరించారు. దీనిపైన జోక్యం చేసుకోవాలని సీఈఓకు అదేశాలు ఇవ్వాలని కోరారు. సమీక్షలపై సీయం అధికారాలను ఆపే హక్కు ఇసికి లేదని స్పష్టం చేసారు. ఇతర పార్టీలు అధికారంలో ఉన్న చోట ఒక విధంగా..లేని చోట మరో విధంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని చంద్రబాబు రాసిన లేఖలో పేర్కొన్నారు.
వైసిపి ఫిర్యాదులకు ప్రాధాన్యం
ఏపిలో వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుల పైన మాత్రమే ఎన్నికల సంఘం స్పందిస్తోందని ముఖ్యమంత్రి ఆరోపించారు. వైసిపి ఫిర్యాదు చేస్తే ఎటువంటి విచారణ లేకుండానే చర్యలు తీసుకుంటున్నారని.. తాము ఇచ్చిన ఫిర్యాదుల పైన మాత్రం స్పందించటం లేదని పేర్కొన్నారు. తమ అభ్యర్దుల పైన ఆదాయపు పన్ను శాఖ అధికారులు , ఇడి దాడులు చేసి వేధింపులకు గురి చేసారని వివరించారు. ఏపిలోని అధికారుల పైన ఎన్నికల సంఘం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవటం సరి కాదని గుర్తు చేసారు. ఏపిలో పోలింగ్ ప్రక్రియ సరిగ్గా జరగలేదని..మరుసటి రోజు తెల్లవారు జాము వరకు పోలింగ్ జరగటం తాను ఎప్పుడూ చూడలేదన్నారు. ఇవియంల పని తీరు పైన ఆయన మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసారు. తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి ఎన్నికల నిర్వహణ ఎప్పడు చూడలేదన్నారు.
సమీక్షలకు అనమతించరా..
ఏపిలో ప్రాజెక్టులు ప్రజలకు ఎంతో అవసరమని.. ప్రాజెక్టులపై సమీక్షలను అడ్డుకోవద్దని చంద్రబాబు కోరారు. శాఖలపై సమీక్ష చేసే అధికారం సీఎంకు లేదని... ఏపీ సీఈవో ద్వివేది చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు అభ్యంతరం తెలిపారు. పోలవరం, రాజధాని నిర్మాణం, మంచినీటి ఎద్దడి, ప్రకృతి వైపరీత్యాలపై సీఎం సమీక్షలు ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. సమీక్షలపై సీఎం అధికారాలను ఆపే హక్కు ఈసీకి లేదన్నారు. ఏపీ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలు, ఎండల కారణంగా గత వారంలో ఏడుగురు మరణించారన్నారు. వైపరీత్యాలపై జాగ్రత్తలు తీసుకోవాలని... అధికారులను ఆదేశించే అధికారం సీఎంకు లేదంటారా అని నిలదీశారు. ఎన్నికల సంఘం వీటి పైన సీఈఓకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.