పెద్ద పార్టీగా బీజేపీ: కూటమి ఐక్యంగా సాగితేనే..ఏపీలో గత ఫలితాలే: రాహుల్కు చంద్రబాబు రిపోర్ట్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. గంటకు పైగా సాగిని వీరిద్దరి సమావేశంలో చంద్రబాబు తన వద్ద ఉన్న అంచనాలతో ఒక రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో జాతీయ స్థాయి లో కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు సాధించి బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని..కూటమి పార్టీలు అన్నీ కలిసి ఉంటేనే లక్ష్యం నెరవేరుతుందని స్పష్టం చేసినట్లు సమాచారం. ఇక, ఏపీలో గత ఫలితాలే వస్తాయని చెప్పుకొచ్చారు.
ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీ..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. అదే విధంగా జాతీయ నేతలు శరద్పవార్, శరద్యాదవ్, సురవరం సుధాకర్రెడ్డి, డి రాజాను వేర్వేరుగా కలిసారు. మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వస్తుండటంతో జాతీయ స్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాల పైనే వారితో చర్చిస్తున్నట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపిని అధికారం లోకి రాకుండా అడ్డుకోవాలంటే ఎటువంటి అడుగులు వేయాలి..ఏకాభిప్రాయం సాధించటమే లక్ష్యంగా సమావేశాలు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు లక్నో వెళ్లారు. అక్కడ మాయావతి, అఖిలేష్ యాదవ్తో సమావేశం కానున్నారు. ఫలితాల తరువాత కూటమి నేతలతో సమావేశానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
అతి పెద్ద పార్టీగా బీజేపీ..
ఇక, కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో చంద్రబాబు గంటకు పైగా సమావేశమయ్యారు. ఆ సమయంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలున్నాయనే దాని పైన తన వద్ద సర్వేల వివరాలను రిపోర్ట్ రూపంలో అందించారు. ఆ నివేదిక ప్రకారం అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించబోతుందని స్పష్టం చేసారు. అలాగే బీజేపీ కన్నా కాంగ్రెస్కు యాభై సీట్లు తక్కువ వస్తాయని చంద్రబాబు జోస్యం చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రాంతీయ పార్టీలకు అత్యధిక సీట్లు వస్తాయని ఆయన చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం.. లేదా ఆ పార్టీ మద్దతుతో ప్రాంతీయ పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడే అవకాశాల పైనే వారిద్దరూ సుదీర్ఘంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు అంచనా ప్రకారం బీజేపీకి వంద సీట్లు కచ్చితంగా తగ్గిపోతాయని ఆయన అంచనా వేస్తున్నారు.
ఏపీలో గత ఫలితాలే వస్తాయి..
ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత రాష్ట్రంలో ఫలితాల పైనా రాహుల్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తాజా గా వస్తున్న సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉన్నా..తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని..పెద్ద సంఖ్యలో లోక్సభ సీట్లు సైతం గెలుచుకుంటామని చంద్రబాబు తన అంచనాలను రాహుల్కు వివరించారు. ఏపీలో ఎన్నికల వేళ అండర్ కరెంట్ పని చేసిందని..సైలెంట్ ఓటింగ్ ద్వారా టీడీపీ వైపే ఓటర్లు మొగ్గు చూపారని చంద్రబాబు విశ్లేషించినట్లు సమాచారం. దక్షిణాదిన బీజేపికి సింగిల్ డిజిట్ దాటదని చంద్రబాబు ధీమా వ్యక్తం చేసారు.అయితు, ఫలితాలకు అనుగుణంగా కలిసి వచ్చే అన్ని పార్టీల నేతలతో సమావేశం కావాలని వీరిద్దరి భేటీలో నిర్ణయించారు.