జగన్ను దెబ్బ తీయాలి..ఆయన్నుకలుపుకు పోదాం: చంద్రబాబు కొత్త వ్యూహం : జగన్ రివర్స్ ప్లాన్..!
Recommended Video
ఏపీ ఫలితాలు ఎలా ఉన్నా టీడీపీ అధినేత చంద్రబాబు ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. కేంద్రంలో మోదీ..ఏపీలో జగన్ను దెబ్బ తీయాలి. ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వైసీపీ ఇబ్బందులు పడాలి. అదే విధంగా కేంద్రంలో మోదీ అధికారంలోకి వస్తే టీడీపీకి ఇబ్బందులు తప్పవనే వాదన ఉంది. దీని కోసం ముందస్తుగానే కేంద్రంలో ఎన్డీఏకు పూర్తి మెజార్టీ రాదని..అదే సమయంలో ఏ ఇతర పార్టీ నుండి వారికి మద్దతు లేకుండా చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు. ఇక, జగన్ను దెబ్బ తీయాలంటే ఆయనకు రాజకీయంగా ఎవరి మద్దతు లేకుండా చేయాలి. అందుకోసం..చంద్రబాబు వ్యూహాలు అమలు చేస్తున్నారు. దీంతో..జగన్ అప్రమత్తం అయ్యారు.
ఆయన్ను కలుపుకుపోదామా...
ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీలోని ముఖ్యులతో సమావేశమైన సమయంలో ఆసక్తి కర చర్చ జరిగినట్లు సమాచారం. ఆ సమావేశంలో చంద్రబాబు ఒక ప్రతిపాదన చేసారు. జాతీయ స్థాయిలో తనకు పోటీగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేసారు. కానీ, విఫలమయ్యారు. ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏకు మెజార్టీ వచ్చే అవకాశం లేదు. ఈ సమయంలో ఏ పార్టీ కూడా ఎన్డీఏకు మద్దతు ఇచ్చే పరిస్థితి కనిపించటం లేదు. ఈ సమయంలోతెలంగాణ సీఎం కేసీఆర్ను సైతం మనం కలుపుకుపోతే ఎలా ఉంటుందంటూ..చంద్రబాబు వారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ను కలుపుకుపోవటం వలన బిజేపీయతర కూటమి బలం పెరగటంతో పాటుగా రాజకీయంగా జగన్ ఒంటరి వాడవుతాడనే విశ్లేషణ టీడీపీలో వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్తో జగన్ కలవలేరని..బిజేపి ఒంటరిగా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదని..ఇక, మరో ప్రత్యామ్నాయం జగన్కు ఉండదన్నది టీడీపీ అధినాయకత్వం అంచనా.
జగన్ రివర్స్ ప్లాన్..
తనకు జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యత లేకుండా చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను పసి గట్టిన జగన్ సైతం కొత్త వ్యూహం సిద్దం చేసుకుంటున్నారు. కేసీఆర్ నిజంగా యుపిఏకు మద్దతు ఇచ్చినా..జగన్కు వచ్చే నష్టం ఏమీ ఉండదు. అయితే, చంద్రబాబు తన నాయకత్వంలో అందరినీ ఒకే తాటి మీదకు తెస్తున్నానని చెబుతున్న సమయంలో చంద్రబాబుకు మద్దతుగా కేసీఆర్ నిలచే అవకాశం లేదన్నది వైసీపీ నేతల అంచనా. చంద్రబాబు ఏం చేసినా..తాను మాత్రం ఫలితాల వెల్లడి వరకూ ఎవరికీ మద్దతు గురించి స్పందించకూడదని నిర్ణయించారు. అదే సమయంలో ఫలితాల్లో ఖచ్చితంగా టీడీపీ కంటే ఎక్కువగా ఎంపీ సీట్లు వస్తాయని..దీని ద్వారా చంద్రబాబు కంటే తనకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని జగన్ అంచనా వేస్తున్నారు. ఎవరికీ ఖచ్చితమైన మెజార్టీ రాని సమయంలో ప్రాంతీయ పార్టీలే కీలకం అవుతాయని..ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారి మాటే చెల్లుబాటు అవుతుందని జగన్ అతి ముఖ్యమైన నేతతో విశ్లేషించారు. చంద్రబాబు ప్రయత్నాలు ఫలించవని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ సహకరిస్తారా..
అయితే, చంద్రబాబు ఆహ్వానించినా కేసీఆర్ సహకరించే పరిస్థితి లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దక్షినాదిన టిఆర్యస్..వైసీపీ జాతీయ స్థాయిలో కీలకం అవుతాయని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. పార్టీ ముఖ్యులతోనూ ఇదే అంశాన్ని వివరించారు. ఎవరి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని.. ఫలితాల తరువాత స్పష్టత వస్తుందని చెబుతూ.. అప్పుడే మన వ్యూహాలు అమలు చేద్దామని చెబుతున్నారు. ఇదే సమయంలో వైసీపీతో కేసీఆర్ సఖ్యత కోరుకుంటున్నారు. దీంతో..ఈ ముగ్గురు తెలుగు నేతల వ్యూహాలు..వారికి దక్కే ప్రాధాన్యం ఏంటనేది ఈనెల 23న ఫలితాల ద్వారా వెల్లడి కానుంది.