చంద్రబాబు అభినవ అబద్దాలకోరు..! ఘాటుగా విమర్శించిన వైసిపీ..!!
హైద్రాబాద్ : ఏపీ సీయం చంద్రబాబు నాయుడు పై ప్రతిపక్ష వైసీపి మరో సారి రెచ్చిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వ లేకుంటే పెథాయ్ తుఫాను ను గుర్తించే పరిస్ధితి లేదన్నట్లుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఎద్దేవా చేశారు. గోబెల్స్ ప్రచారం చేయడంలో చంద్రబాబు ముందుంటారని విమర్శించారు. ప్రకృతిపై గెలుపు, సముద్రాన్ని కంట్రోల్ చేయగలిగాం, హుద్ హుద్, తిల్లీలను జయించాం, టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేశానని, నేను వచ్చాకే హైదరాబాదుకు కంరెటు, నీళ్ళూ వచ్చాయని, వ్యవసాయానికి నోబెల్ ప్రైజ్ ఇప్పిస్తానని, అమరావతిలో ఒలంపిక్స్ పెడతానని చంద్రబాబు చేస్తున్న అర్ధంపర్ధం లేని వ్యాఖ్యలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.
ఇంత దారుణంగా గొప్పలు చెప్పుకునే వ్యక్తి ప్రపంచంలో చంద్రబాబు తప్ప వేరొకరు లేరని చెప్పారు. ఆర్టీజీఎస్ లేని సమయంలో తుఫానులపై హెచ్చరికలు చేయలేదా, భారతదేశంలో వాతావరణ శాఖ పనితీరు మర్చిపోయారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి ప్రధాన కారణం తాను చేస్తున్న అవినీతి వ్యవహరాలు చర్చకు రాకుండా ప్రజల ద్రుష్టి మళ్లించడానికే అని బుగ్గన విమర్శించారు. చంద్రబాబు సర్కారు ఇళ్ల నిర్మాణానికి ఎక్కువ ధర చెల్లిస్తున్నారని తెలంగాణతో పోలిస్తే ఐదు వేల కోట్ల రూపాయలు తేడా కనిపిస్తోందని.. ఇళ్ల నిర్మాణంలో పెద్ద యెత్తున అవినీతి జరిగిందని రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు.