చంద్రబాబు అరుదైన రికార్డు : జగన్ మరోసారి గుర్తు చేసారు : బాబు ఎప్పటికీ మర్చిపోలేరు..!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత చంద్రబాబు అరుదైన రికార్డులు సొంతం చేసుకుంటున్నారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా..రాష్ట్ర విభజన తరువాత అయిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసారు. ఇక, ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇప్పుడు ఏపీలో మరో సారి ప్రతిపక్ష నేత పాత్ర పోషించబోతున్నారు. ఇదే సమయంలో జగన్ కారణంగా ఆయనకు మరో రికార్డు సైతం సొంతం చేసుకోబోతున్నారు.
చంద్రబాబు కొత్త రికార్డు..
టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త రికార్డు సృష్టిస్తున్నారు. 24 ఏళ్లుగా టీడీపీ అధినేతగా చంద్రబాబు కొనసాగుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 1995 నుండి 2004 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేసారు. తొమ్మిదేళ్ళ పాటు సీఎంగా పని చేసి అప్పటికే రికార్డు సాధించారు. అప్పటి వరకు ఎన్టీఆర్ ఏడేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసినా..కంటిన్యూగా చేయలేదు. ఆ తరువాత 2004 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయంది. వైయస్సార్ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో..టీడీపీ ఎల్పీ నేతగా ఎన్నికైన చంద్రబాబు ప్రతిపక్ష నేత అయ్యారు. అయిదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. తిరిగి 2009 ఎన్నికల్లో ఎలాగైనా గెలుస్తామని ఆశించిన చంద్రబాబు మహా కూటమి పేరుతో వామపక్షాలు..టీఆర్యస్తో కలిసి కాంగ్రెస్ మీద పోటీ చేసారు. అయినా..2009 ఎన్నికల్లో తిరిగి వైయస్ సీఎం అయ్యారు. దీంతో..చంద్రబాబు మరోసారి ప్రతిపక్ష నేతగా కొనసాగాల్సి వచ్చింది.
2014లో తిరిగి అధికారంలోకి..
2014లో ఏపీ విభజన జరిగింది. ఆ సమయంలో ఏపీలో చంద్రబాబు అనుభవానికి గుర్తింపుగా నూతన ఏపీలో టీడీపీకి పట్టం కట్టారు. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు 2014, జూన్8న ప్రమాణ స్వీకారం చేసారు. అయిదేళ్ల పాటు సీఎంగా పని చేసిన చంద్రబాబు..మొత్తం 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసి ఏపీలో రికార్డు సాధించారు. తెలంగాణలో అయిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్ తిరిగి 2018 ఎన్నికల్లో గెలుపొంది మరోసారి సీఎం అయ్యారు. ఇక, తాజాగా 2019 ఎన్నికల్లో వైసీపీ గెలవటంతో..చంద్రబాబు తిరిగి ప్రతిపక్ష నేతగా పార్టీ ఎన్నుకుంది. దీంతో..2024 వరకు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. దీని ద్వారా ముఖ్యమంత్రిగా 14 ఏళ్ల పాటు..ప్రతిపక్ష నేతగా 2024వరకు కొనసాగితే 15 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగిన రికార్డు ఆయనదే అవుతుంది.
అసలు దెబ్బ వారితోనే.
ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. 1999 నుండి 2004 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైయస్సార్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. నాడు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. అప్పుడు వైయస్ హయాంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండేవారు. ఇక, 2014లో తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వగా..వైయస్ తనయుడు జగన్ ఏపీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఆయన సైతం తండ్రి తరహాలోనే పాదయాత్ర చేసి 2019 ఎన్నికల్లో చంద్రబాబును ఓడించి అధికారంలోకి వచ్చారు. అప్పుడు తండ్రి ప్రతిపక్ష నేతగా ఉండి అధికారంలోకి వచ్చి చంద్రబాబును ప్రతిపక్ష నేతగా చేసారు. ఇప్పుడు అదే విధంగా జగన్ ప్రతిపక్ష నేతగా ఉండి పోరాడి అధికారంలోకి వచ్చి సీఎంగా ఉన్న చంద్రబాబును మరోసారి ప్రతిపక్ష నేతగా మార్చారు. వైయస్ కుటుంబం మూడు సార్లు చంద్రబాబును అధికారంలో నుండి విపక్షానికి పంపేసారు.