శభాష్!..లోకేష్:చంద్ర బాబు,ఇంత స్వార్థ ముఖ్యమంత్రిని చూడలేదు:మాజీ ఎంపి వరప్రసాద్
అమరావతి:పంచాయితీ రాజ్ శాఖా మంత్రి నారా లోకేష్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనల జల్లు కురిపించారు. బుధవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జాతీయస్థాయిలో 22 స్కోచ్ అవార్డులు సాధించినందుకు మంత్రి లోకేష్ను, అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు. అలాగే రూ.20 వేల కోట్లు ఖర్చు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచినందుకు పంచాయతీరాజ్ శాఖను మెచ్చుకున్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి మరింత మెరుగ్గా పనిచేయాలని సూచించారు.
రోడ్ల నిర్మాణంపై...సిఎం దిశానిర్దేశం
ప్రతి పంచాయతీ ఆర్ధికంగా స్వయం సమృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా ఆ శాఖ కు సూచించారు. నాలుగేళ్లలో వివిథ గ్రామాల్లో 17 వేల కి.మీ.సిమెంట్ రోడ్లు నిర్మాణం జరిగిందని, ఇది ప్రభుత్వం చిత్తశుద్దికి నిదర్శనమన్నారు. ఈ ఏడాదిలో మరో 8 వేల కి.మీ. రోడ్లు నిర్మించి 25 వేల కి.మీ లక్ష్యాన్ని చేరుకోవాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
స్వార్థ ముఖ్యమంత్రి:వరప్రసాద్
గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో అన్యాయాలు,అక్రమాలు బాగా పెరిగిపోయాయని తిరుపతి మాజీ ఎంపి వరప్రసాద్ అన్నారు. తిరుపతి వైసిపి కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబు తన అనుభవాన్నంతా ప్రజా సొమ్మును దోచుకునేందుకు ఉపయోగిస్తున్నారన్నారు. బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల రేషన్ కార్డులు, 10లక్షల పెన్షన్లు తొలగించారని, రెండు లక్షల కాంట్రాక్టు ఉద్యోగాలు పీకేశారని చెప్పారు. 60 ప్రభుత్వ సంస్థలను మూయించారని ఆరోపించారు. ఒక ఐఎఎస్ అధికారిగా తాను ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను కానీ...నా జీవితంలో బాబులాంటి స్వార్ధ ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని, ఇలాంటి బాబుకి ప్రజలు తగిన విధంగా బుద్ధిచెబుతారని అన్నారు.
Recommended Video
కడతామంటే...వద్దంటామా?: కన్నా
కడపలో ఎంపీ సీఎం రమేష్, బీటెక్ రవి చేస్తున్న ఉక్కుదీక్ష ఓ డ్రామా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. బుధవారం అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిది కాంట్రాక్టర్ పాత్రే నని చెప్పుకొచ్చారు. చంద్రబాబు చెప్పినట్లే కోడలు కొడుకును కంటే అత్త వద్దంటుందా?...అన్నచందంగా వారే పోలవరం ప్రాజెక్ట్ కడతామంటే...మేము వద్దంటామా?...అని కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు.
జగన్ వ్యాఖ్యలకు...ఖండన
కలెక్టర్లు లంచగొండి అవతారమెత్తారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను పిఠాపురం ఎమ్మెల్యే వర్మ తీవ్రంగా ఖండించారు. వైఎస్ హయాంలో పనిచేసిన ఐఏఎస్లు జైలుపాలయ్యారని ఆయన గుర్తు చేశారు. కేవీపీతో కలిసి జగన్ భూదందాలకు పాల్పడలేదా? అని వర్మ ప్రశ్నించారు...పట్టిసీమ, పురుషోత్తపట్నం పథకాల ద్వారా నీరివ్వడం వల్ల గోదావరి నది ఎండిపోయిందని జగన్ అనడం హాస్యాస్పదమని అన్నారు. నదుల అనుసంధానం ద్వారా రాయలసీమ నీటి కష్టాలు తీరాయని వర్మ చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడంలేదు అని జగన్ అనడం సరికాదని ఎమ్మెల్యే వర్మ ధ్వజమెత్తారు.