శ్రీకాకుళంలో చంద్రబాబు: రోజుకు మూడు గంటలు కార్యకర్తలకోసం కేటాయిస్తానని హామీ
తిరుపతిలో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్కడ బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కడ ప్రసంగించిన అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా శ్రీకాకుళంకు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనించిందన్నారు. తమ ప్రభుత్వం పేదలకోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రానికి పరిశ్రమలు తరలివచ్చాయంటే అది టీడీపీ ప్రభుత్వం చేసిన కృషే అని చెప్పారు. యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చి వారిని ఆదుకున్న ప్రభుత్వం తమదని చంద్రబాబు చెప్పారు.
శ్రీకాకుళంలో 10 స్థానాలకు 10 స్థానాలు టీడీపీ గెలుచుకుంటుందన్న ఆత్మవిశ్యాసాన్ని చంద్రబాబు వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను చంద్రబాబు ప్రజలకు పరిచయం చేసి వారిని గెలిపించాల్సిన బాధ్యత ప్రజలదే అని అన్నారు. కార్యకర్తలు వీరి గెలుపునకు కృషి చేయాలని చెప్పిన చంద్రబాబు .... పార్టీకి కార్యకర్తలే వెన్నెముకలాంటి వారని అన్నారు. దేశంలో అత్యధిక కార్యకర్తలున్న పార్టీగా టీడీపీకి ప్రత్యేక గుర్తింపు ఉందన్న చంద్రబాబు....పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ అన్నిటినీ అధిగమిస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యకర్తలు 25 రోజులు కష్టపడితే మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందని బాబు అన్నారు. అంతేకాదు ఎన్నికల తర్వాత రోజుకు మూడు గంటలు కార్యకర్తల కోసం కేటాయిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక వైసీపీ సభ్యులు అసెంబ్లీనే మరిచిపోయారని చంద్రబాబు దుయ్యబట్టారు. రెండున్నరేళ్లుగా వారు అసెంబ్లీకి రాకుండానే జీతాలు తీసుకున్నారని ధ్వజమెత్తారు. తిత్లీ తుఫాను వచ్చిన సమయంలో మోడీ కనీసం పరామర్శకు కూడా రాలేదని రాష్ట్ర అభివృద్ధిని కేసీఆర్, జగన్ మోడీలు అడ్డుకుంటున్నారని నిప్పులు చెరిగారు చంద్రబాబు.
పవన్కు జగన్ షాక్...జనసేన ప్రకటించిన అభ్యర్థి వైసీపీలోకి..
వివేకా మృతి చాలా బాధాకరం అన్న చంద్రబాబు...ఆయన మృతి వెనక చాలా అనుమానాలున్నాయన్నారు. సొంతవారే వివేకా హత్యకు గురైన తర్వాత కొన్ని సాక్షాలను డ్యామేజీ చేశారని ధ్వజమెత్తారు. వివేకానందరెడ్డిని ఎవరి చంపారో రాష్ట్రానికి తెలియాల్సి ఉందా లేదా అని ఆయన ప్రశ్నించారు..? చనిపోయిన తర్వాత ఎవరు ముందుగా చూశారు..? సాక్షాలను కనుమరుగయ్యేలా ఎవరు చేశారు....? ఎవరు ముందుగా ఫిర్యాదు చేశారు...? ఈ విషయాలన్నిటిని రాష్ట్ర ప్రజలకు తెలపాలి అని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇక సాయంత్రం వివేకా తాను రాసిన లేఖ బయటపెట్టారని ఇదంతా ఒక డ్రామాగా ఉందని చంద్రబాబు అన్నారు. దీన్నే పులివెందుల రాజకీయం అని అంటారని చంద్రబాబు ధ్వజమెత్తారు.