పశ్చిమ బెంగాల్ పరిణామాలపై బాబు స్పందన..! పార్లమెంట్ లో ప్రస్థావించాలని ఎంపీలకు ఆదేశాలు..!!
అమరావతి : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఏపి సీయం చంద్రబాబు నాయుడు బాసటగా నిలుస్తున్నారు. బీజేపియేతర రాష్ట్రాలపై మోదీ కక్ష్యపూరితంగా వ్యవహరిస్తురనే భావన బాబు వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న పరిణామాలను పార్లమెంట్లో ప్రస్తావించాలని బాబు టీడీపీ ఎంపీలను ఆదేశించారు. అనుమతి తీసుకోకుండా, నోటీసులు ఇవ్వకుండా సీబీఐ అధికారుల జోక్యంపై పార్లమెంట్లో లేవనెత్తాలన్నారు. కేసుపై హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ సీబీఐ అధికారులు ఎందుకు వచ్చారన్నదే ప్రశ్న అన్నారు. ఈ అంశంపై బీజేపీయేతర పక్షాల నేతలందరితో మాట్లాడిన చంద్రబాబు సాయంత్రం ఢిల్లీలో అందరూ కలవాలని నిర్ణయించారు. రాజకీయ ప్రత్యర్థులందరిపై కేసులు పెట్టి బీజేపీ నేతలు ఆనందిస్తున్నారని సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్లో నెలకొన్న పరిణామాలు దుర్మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం పార్టీ నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాలను తమ నియంత్రణలో ఉంచుకోవాలనే కేంద్ర ప్రయత్నాలను ఖండిస్తున్నామన్నారు. సమాఖ్య స్ఫూర్తికి ఇది విరుద్ధమని, అంతా ఐక్యంగా పోరాడతామని స్పష్టం చేశారు. అమిత్ షా పలాస పర్యటన రాజకీయ స్వార్థమే అని నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని నేతలకు ఆదేశించారు. బీజేపీయేతర పక్షాలు ఇవాళ ఈసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించామని, ఈ విషయం తెలిసే జగన్ హడావుడిగా ఢిల్లీ వెళ్లారని విమర్శించారు. హైకోర్టు నిర్మాణంతో నవ్యాంధ్రలో నవశకానికి నాంది పలికామని అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం జరుగుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.