ఉత్తరాంధ్రలో పట్టు నిలిచిందా: రెండు జిల్లాల నేతలకు సీఎం పిలుపు : ఎన్ని సీట్లు వస్తాయి...!
గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టిడీపీ అధిక సీట్లు సాధించింది. ఈ సారి ఎన్నికల్లో అదే పట్టు నిలిచిందా..సడలిందా అనే కోణంలో టీడీపీ అధినాయకత్వం అనేక సర్వేలు చేయించింది. తమ వద్ద ఉన్న వివరాలతో పాటుగా క్షేత్ర స్తాయి లోని సమాచారంతో రావాలంటూ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. శ్రీకాకుళం..విజయనగరం జిల్లాల టీడీపీ అభ్యర్దులు..నేతలు పోలింగ్ సరళి నివేదికలతో ఈ రోజు అధినేతతో సమావేశం కానున్నారు.
శ్రీకాకుళం జిల్లాపై టీడీపీ ఆశలు..
శ్రీకాకుళం జిల్లాలోని ఒక లోక్సభ పది అసెంబ్లీ నియోకవర్గాల్లో పోలింగ్ సరళి తరువాత టీడీపీ నేతలు ధీమాగానే కనిపిస్తున్నారు. లోక్సభ అభ్యర్దిగా సిట్టింగ్ ఎంపీ కింజరపు రామ్మోహన నాయుడు తిరిగి బరిలో నిలిచారు. వైసీపీ నుండి దువ్వాడ శ్రీను పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్దులుగా పోటీలో ఉన్న వారి కంటే ఎంపీ అభ్యర్దిగా మాత్రం రామ్మోహన్ నాయుడకే ఎక్కువగా ఓట్లు పడ్డాయనేది క్షేత్ర స్థాయి అంచనా. అయితే, వైసీపీ మాత్రం ఈసారి శ్రీకాకుళం ఎంపీ సీటు తమదే అంటూ లెక్కలు బయటకు తీస్తోంది. ఇదే జిల్లా నుండి ఇద్దరు మంత్రులు బరిలో ఉన్నారు. ఎచ్చెర్ల నుండి టీడీపీ ఏపీ అధ్యక్షుడు..మంత్రి కళా వెంకటరావు పోటీ చేస్తున్నారు. టెక్కలి నుండి మరో మంత్రి అచ్చంనాయుడు బరిలో నిలిచారు. మొత్తం పది స్థానాల్లో ఎన్ని చోట్ల గెలుస్తామనేది టీడీపీ నేతలు స్పష్టంగా చెప్పటం లేదు. దీంతో..బూత్ స్థాయి ఓటింట్ సరళితో నియోజకవర్గాల వారీగా నివేదికలతో అమరావతి చేరుకున్నారు.
విజయనగంలో మార్పు కనిపించిందా..
ఇక, గత ఎన్నికల్లో ఈ రెండు జిల్లాలోని శ్రీకాకుళం, అరకు, విజయనగరం ఎంపీ స్థానాల్లో అరకు వైసీపీ గెలవగా.. టీడీపీ మిగిలిన రెండు స్థానాలు దక్కించుకుంది. ఈ సారి అరకు నుండి కాంగ్రెస్ సీనియర్ నేత కిశోర్ చంద్రదేవ్ టీడీపీ అభ్యర్దిగా పోటీ చేసారు. ఇక, విజయనగరం నుండి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు తిరిగి ఎంపీ అభ్యర్దిగా పోటీ చేయగా..ఆయన కుమార్తె విజయనగరం ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు. విజయనగరం జిల్లాలోని మొత్తం తొమ్మది స్థానాల్లో హోరా హోరీ పోరు సాగిందని తెలుస్తోంది. అయితే, వైసీపీ గతం కంటే ఈసారి ఎక్కువ సీట్లు గెలుస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. బొత్సా కుటుంబం ఈసారి వైసీపీ నుండి బరిలో ఉంది. దీంతో..ఇక్కడ ఎంపీ అభ్యర్దిగా టీడీపీకి విజయనగరం జిల్లా కేంద్రంలో మెజార్టీ వస్తుందని..మిగిలిన చోట్ల వైసీపీ అభ్యర్ది మెజార్టీ సాధిస్తారని వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఈ జిల్లా నేతలను కూడా చంద్రబాబు తన వద్దకు రావాలని ఆహ్వానించారు.
రెండు జిల్లాల నేతలతో సమీక్ష..
మధ్యలో విరామం తరువాత టీడీపీ ఎన్నికల సమీక్షలు తిరిగి ప్రారంభం కానున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం లోక్సభ స్థానాల పరిధిలోని అభ్యర్థులు, పార్టీ నేతలతో చంద్రబాబు శుక్రవారం ఇక్కడ హ్యాపీ రిసార్ట్స్లో సమావేశం కానున్నారు. ఉదయం శ్రీకాకుళం, సాయంత్రం విజయనగరం నేతలతో ఆయన సమీక్ష నిర్వహిస్తారు. క్షేత్ర స్థాయి నివేదికలు..తాను చేయించిన సర్వేలు..తన వద్దకు వచ్చిన అంచనాల గురించి జిల్లా నేతలతో విశ్లేషణ చేయనున్నారు. ఈ రెండు జిల్లాలో టీడీపీ సాధించే ఫలితాల పైన ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది.