లోకల్ వార్ ...బెదిరింపులు,దాడులపై టీడీపీ ఫైర్ ..రీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఈసీకి బాబు లేఖ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు టీడీపీకి ఇబ్బందికరంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడుతూ అభ్యర్థులను భయ భ్రాంతులకు గురి చెయ్యటం అలాగే అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చించి వెయ్యటం వంటి ఘటనల నేపధ్యంలో టీడీపీ నేతలు చాలా చోట్ల నామినేషన్లు దాఖలు చెయ్యలేదు. దీంతో టీడీపీ వైసీపీ కావాలనే ఇదంతా చేస్తుందని మండిపడుతుంది.సత్తా ఉంటే ఎన్నికలు స్వేఛ్చగా జరిగేలా చూసి ఎన్నికల్లో ప్రజా క్షేత్రం లో తేల్చుకోవాలని టీడీపీ మండిపడుతుంది .
చంద్రబాబును ఒంటరిని చేసే పనిలో సీఎం జగన్ .. స్థానిక ఎన్నికల్లో ఊహించని ఒత్తిడితో బాబు పరేషాన్
పోలీసులు వైసీపీ నేతల చేతుల్లో కీలుబొమ్మలని ఫైర్
వైసీపీ నేతలు ఆడించినట్లు పోలీసులు ఆడుతున్నారని , వైసీపీ నేతల చేతుల్లో కీలు బొమ్మలుగా మారారని టీడీపీ నేతలు పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఎస్పీలు కనీసం తన ఫోన్ కూడా ఎత్తడం లేదని, పోలీసులు తీరు మార్చుకోకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. ఇంతా జరుగుతున్నా డీజీపీ చోద్యం చూస్తున్నారని అన్నారు . రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ తరపున నామినేషన్ వేసిన వారిని బెదిరించారని, సచివాలయ ఉద్యోగులు, పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. సమస్యలున్న చోట రీనామినేషన్కు అనుమతివ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.
రీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఈసీకి లేఖ రాసిన చంద్రబాబు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. ఇక దౌర్జన్యాలు, దాడులు, బెదిరింపులు , కిడ్నాప్ లు, నామినేషన్లు వెయ్యకుండా అడ్డుకోవటాలు వంటి ఘటనలతో స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల కమీషన్కి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. రీ నోటిఫికేషన్ ఇవ్వాలని చాలా చోట్ల నామినేషన్లు దాఖలు చెయ్యకుండా అడ్డుకున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు.
172 చోట్ల అభ్యర్థులు నామినేషన్లు వెయ్యలేదని పేర్కొన్న టీడీపీ అధినేత
అయితే స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారని పేర్కొన్న చంద్రబాబు 172 చోట్ల అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారని ఆ లేఖలో పేర్కొన్నారు . అయితే ఈ 172 చోట్ల రీ నోటిఫికేషన్ జారీ చేయాలని చంద్రబాబు నాయుడు ఈసీనీ కోరుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు. పులివెందుల, పుంగనూరు, మాచర్ల, మంత్రాలయం వంటి పలు ప్రాంతాలలో రీ నోటిఫికేషన్ ఇస్తే అన్ని చోట్లా ఎన్నికలు నిర్వహించటానికి వీలవుతుందని ఆయన తన లేఖ ద్వారా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని , రీ నోటిఫికేషన్ నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు కోరారు.