ఆయనో పనికిమాలిన అధికారి: జీఎన్ రావుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సీనియర్ ఐఏఎస్, రిటైర్డ్ అధికారి, జీఎన్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జీఎన్ రావు ఒక పనికిమాలిన అధికారి అని ఆయనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉన్నసీనియర్ ఏఐఎస్ జీఎన్ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపధ్యంలో ఆ కమిటీ రాజధాని అంశంపై నివేదిక ఇచ్చింది . ఆ కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చంద్రబాబు పనికిమాలిన ఆయన పేరుతో కమిటీ వేశారని ధ్వజమెత్తారు.
రాజధాని కమిటీలు అన్నీ బోగస్ కమిటీలు అన్న చంద్రబాబు
ఇక అంతే కాదు ఇప్పుడు రాజధాని పేరుతో వేసిన కమిటీలు అన్నీ బోగస్ అని పేర్కొన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్రెడ్డి ఫ్రెండ్ బీసీజీ డైరెక్టర్ భట్టాచార్య అని చంద్రబాబు తెలిపారు. విభజన చట్టాన్ని ఉల్లంఘించే అధికారం మీకు ఎవరిచ్చారు? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తి మన సీఎం అని , సిగ్గులేని వ్యక్తి జగన్ అని పేర్కొన్న చంద్రబాబు 6093 అని గూగుల్లో సెర్చ్ చేస్తే జగన్ పేరు కనిపిస్తుందని చెప్పారు.
రాజధాని మార్చటం కోసమే ఇన్సైడర్ ట్రేడింగ్ అని కొత్త పాట
విభజన చట్టంలో మూడు రాజధానుల ప్రస్తావన లేనే లేదని చెప్పిన చంద్రాబు విజయవాడ-గుంటూరు మధ్యలో రాజధాని నిర్మించాలని, శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని స్పష్టం చేశారు .కావాలని రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ కొత్త పాట అందుకున్నారని ఆరోపించిన చంద్రబాబు నాడు రాజధానిని దొనకొండకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారని తెలిపారు. అమరావతిలో అంతా చట్టబద్దంగానే జరిగిందని చెప్పిన చంద్రబాబు జగన్ మాదిరిగా అందరూ దొంగ లెక్కలు రాస్తారని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
అమరావతిలో భూముల ధరలు పెరిగితే అంత కడుపు మంటనా అని ప్రశ్న
అమరావతిలో 10వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పిన చంద్రబాబు భూముల ధరలు పెరిగితే మీకు ఎందుకు కడుపు మంట అని ప్రశ్నించారు. గతంలో హైదరాబాద్ విషయంలో అదే జరిగిందని ఆయన గుర్తు చేశారు. భూములు అమ్ముకోవద్దని హైటెక్ సిటి నిర్మించక ముందు చెప్పానన్న చంద్రబాబు హైటెక్ సిటి నిర్మించాక ఎకరం 30కోట్లు అమ్ముడుపోయిందని గుర్తుచేశారు. అభివృద్ధి చేశాక భూముల ధరలు పెరగడం సహజం అని గుర్తు చేశారు.
జీఎన్ రావుపై చంద్రబాబు వ్యాఖ్యలపై చర్చ
మొత్తానికి రాజధాని వ్యవహారంపై జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చిన సందర్భంగా ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు సీనియర్ అధికారిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ , అటు అధికార వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. ఈ రోజు రాజధాని ఎర్రబాలెం లో రైతుల దీక్షకు మద్దతు తెలిపిన చంద్రబాబు దీక్షలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.