జగన్ కు ఓటేస్తే మరణ శాసనమే: పికె బీహారీ డెకాయిట్: జనసేన తో పొత్తు పై చంద్రబాబు ఇలా..!
Recommended Video
వైసిపి అధినేత జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. జగన్-మోదీ-కేసీఆర్ కలిసి త న పై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ కేసుల విషయంలో మోదీ కాపాడుతున్నారన్నారు. తనను ఇబ్బంది పెట్టేందుకే తొలి విడత లోనే ఏపి ఎన్నికలు పెట్టారన్నారు. మోదీని చౌకీదార్ కాదు..చోర కీ దార్ అన్నారు. పికె ను బీహారీ డెకాయిట్ గా పేర్కొన్నారు.
జగన్ కు ఓటేస్తే..
వైఎస్ జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. జగన్కు ఓటేస్తే మార్పు కాదు.. మరణశాసనమే అన్నారు. జగన్ లాంటి వారందరికీ కాపలాదారు మహానాయకుడు కేసీఆర్ అన్నారు. ఏపీ డీజీపీ ఇంటిని అడ్డగోలుగా కూలదోయాలని కేసీఆర్ ప్రయత్నం చేశారని.. మరి జగన్ దోచిన 11 ఎకరాల విషయంలో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మోదీ, జగన్తో కేసీఆర్ లాలూచీకి ఇదే నిదర్శనమన్నారు. కేసీఆర్..రాష్ట్రాన్ని కుక్కలు చింపినవిస్తరి చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. జగన్ పూర్తిగా కేసీఆర్కి కాల్మొక్కుతా అనే పరిస్థితికి వచ్చారన్నారు. ఈడీ లేఖపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని నిలదీసారు. సీబీఐ మొద్దునిద్ర పోతోందా.. నేను మీ భవిష్యత్ - నా బాధ్యత అని చెబుతుంటే.. జగన్ మాత్రం నా భవిష్యత్- మీ బాధ్యత అంటున్నారు. ఎవరికి ఓటు వేస్తారో ప్రజలు తేల్చుకోవాలని..జగన్ లాంటి నేరస్థుడికి స్థానం లేదన్నారు.
జగన్ జీవితం అడ్డదారి..పికె ఓ డెకాయిట్
ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని జగన్ దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. జగన్ జీవితం అడ్డదారి, వైసీపీది చెడుదారి అని వివరించారు. చట్టంలో ఎన్ని నేరాలు ఉన్నాయో జగన్ అన్నీ చేశారన్నారు. జగన్ ఇప్పటి వరకు ఆర్థిక నేరాలే చేశారని, కానీ ఇప్పుడు రాజకీయాల్లోనూ కొత్త నేరాలు చేస్తున్నారని ఆరోపించారు. దేశ చరిత్రలో ఇంతటి దివాళాకోరు రాజకీయాలు ఎప్పుడూ చూడలేదన్నారు. టీడీపీ డేటా దొంగిలించడానికి ప్రయత్నించి జగన్ అడ్డంగా దొరికిపోయారని పేర్కొన్నారు. ఒక ప్లాన్ ప్రకారం పాయింట్ల వారీగా రాసుకుని మరీ టీడీపీపై కుట్ర చేశారన్నారు. ఈసీకి విజయసాయిరెడ్డి ఇచ్చిన లేఖలో వివరాలన్నీ ఉన్నాయని తెలిపారు. వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ కలిసి ఈ డ్రామా నడిపారని తెలిపారు. ఇంతకు ముందు కూడా పంటలు తగలబెట్టడం లాంటి అరాచకాలు చాలా చేశారని గుర్తుచేశారు. నేరాలు చేయడంలో గ్రాండ్ మాస్టర్ అన్న చంద్రబాబు వీరికి తోడుగా బీహారీ డెకాయిట్ పికె తోడుగా చేరారని విమర్శించారు.
జనసేనతో పొత్తు పై ఇలా..
తనను ఇబ్బంది పెట్టటానికి తొలి విడతలోనే ఎన్నికలు పెట్టారని..అయితే తాను దీనిని ఓ అవకాశంగా మలచుకుం టానని చెప్పుకొచ్చారు. ఏపిలో లేని జగన్ కు ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉండదన్నారు. ఇక, జనసేన తో పొత్తు పైనా ముఖ్యమంత్రి స్పందించారు. జనసేనతో టిడిపికి పొత్తే ఉండదని తేల్చి చెప్పారు. ఏపి ప్రయోజనాలు పట్టని జగన్ కు ఏపి ప్రజలు ఓట్లు వేయరన్నారు. జగన్ క్విడ్ ప్రో కో ను నిర్ధారిస్తూ సిబిఐ కు ఇడి రాసిన లేఖను చంద్రబాబు విడుదల చేసారు. దీని పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రధానిని ప్రశ్నించారు.