జగన్ది అనవసరపు ఆయాసం: బాబాయ్ని చంపి అరాచకం :సీఈసీ ఫోజులు కొడుతున్నాడు : బాబు ఫైర్..!
టిడిపి అధినేత చంద్రబాబు మరోసారి ఎన్నికల సంఘం..వైసిపి..మోదీ పై విరుచుకుపడ్డారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఢిల్లీలో కూర్చొని ఫోజులు కొడుతున్నారంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. జగన్తో పాటుగా ఆయన పార్టీ నేతలది అనవసరపు ఆయాసమని..ప్రజలు తీర్పు ఇచ్చేసారని చెప్పుకొచ్చారు. ఇతర ముఖ్యమంత్రుల మీద ఐటి దాడులు జరుగుతున్నాయి కానీ, బిజెపి ముఖ్యమంత్రుల మీద ఎందుకు జరగవని ప్రశ్నించారు.
జూన్ 8 వరకూ నాదే అధికారం..
తనకు ముఖ్యమంత్రిగా జూన్ 8 వరకు సమయం ఉందని చంద్రబాబు స్పష్టం చేసారు. ఎన్నికల కోడ్ ఉంటే పాలసీ నిర్ణయాలు తీసుకోకూడదని..ప్రజా సమస్యల పైన సమీక్షలు చేయకూడదని ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు. ఇక, పోలింగ్ ముగిసిన నాటి నుండి జగన్..ఆయన పార్టీ నేతలు అనవసరంగా ఆయాస పడుతున్నారన్నారు. గెలిచేస్తాం.. వచ్చేస్తాం అంటున్నారని..ఎక్కడకు వస్తారని ప్రశ్నించారు. ఏపి పాలన కేంద్రానికి అప్పగించాలనేది జగన్ కుట్ర అని చంద్రబాబు విమర్శించారు. వైసిపి నేతలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని..తాను తప్పితే ఏపి గడ్డ మీద నుండి ప్రజా సమస్యల పై ఎవరు స్పందిస్తున్నారని ప్రశ్నించారు. వైసిపి నేతలే హింసకు పాల్పడి వారే గవర్నర్ వద్దకు వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బాబాయ్ను చంపి అరాచకం సృష్టించారని..కోర్టుకు వెళ్లి దాని పైన ఎవరూ మాట్లాడకుండా చేసారని దుయ్యబట్టారు.
సీఈసీ ఫోజులు కొడుతున్నారు..
కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి పైనా చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి ఢిల్లీలో కూర్చొని ఫోజులు కొడుతున్నారని వ్యాఖ్యానించారు. రెండు గంటల పాటు పోలింగ్ నిలిస్తే రీపోలింగ్ నిర్వహించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఫాం-7 దరఖాస్తులు వచ్చిన ఐపి చిరునామాలు అడిగితే ఎన్నికల సంఘం ఎందుకు ఇవ్వటం లేదని..దొంగలకు మద్దతుగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని విమర్శించారు. వీవీ ప్యాట్లను 50 శాతం లెక్కించటానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. ఒడిశా, కర్నాటక ముఖ్యమంత్రుల హెలికాఫ్టర్లను తనిఖీ చేసిన ఐటి అధికారులు ఎక్కడైనా బిజెపి ముఖ్యమంత్రులను తనిఖీ చేసారా అని నిలదీసారు. 11వ తేదీ పోలింగ్ పూర్తయితే 12వ తేదీ రాత్రి ఇవియంలు స్ట్రాంగ్ రూమ్లకు చేరాయంటే ఎవరి జీవితాలతో ఆడుకుంటున్నారని ఫైర్ అయ్యారు.
ఎల్వీ సుబ్రమణ్యం కేసుల్లో లేరా..
ఎన్నికల సంఘం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునీతను తప్పించి..ఎల్వీ సుబ్రమణ్యంను ఎందుకు నియమించారని మరో సారి చంద్రబాబు ప్రశ్నించారు. ఎల్వీ పై కేసులు లేవా అని నిలదీసారు. రిటైర్డ్ ఐఏయస్ అధికారులకు ఎన్నికల సంఘం బదిలీ చేసిన అధికారుల గురించి మాట్లాడరా అని ప్రశ్నించారు. వారు వ్యక్తిగత అజెండాతో ముందుకెళ్తే ఎలా అన్నారు. అసలు ఎల్వీ సుబ్రమణ్యం పోలింగ్ నాడు డిజిపి కార్యాలయానికి ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు. పోలవరం..తాగు నీటి ఎద్దడి పైన చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోలవరం ఇప్పటి వరకు 69 శాతం పూర్తి చేసామని..డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని వెల్లడించారు.