చంద్రబాబుకు నచ్చటం లేదు: జగన్ నిర్ణయాలు సరికాదు..రాజధాని నిలిచిపోయే స్థితికి తెచ్చారు..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ 15 రోజుల పాలన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నచ్చటం లేదు. రాజధాని నిలిచిపోయే పరిస్థితి తెచ్చారని వ్యాఖ్యానించారు. అభివృద్ది నిలిపివేసేలా వ్యవహరిస్తున్నారని...ఏపీకీ పెట్టుబడులు నిలియిపోతా యంటూ పార్టీ నేతలతో కామెంట్ చేసారు. గత ప్రభుత్వంలో అవినీతి ఆధారాలు ఉన్నాయని చెప్పిన జగన్..ఇప్పుడు అవినీతిని బయటపెడితే అవార్డులు ఇస్తామని చెప్పటం ద్వారా..జగన్ చేసినవన్నీ అధారాలు లేని ఆరోపణలే అనే విషయం తేలిపోయిందన్నారు. సంక్షేమానికి సహకరిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రాజెక్టులను ఏకపక్షంగా నిలిపివేస్తారా..
ఏపీకీ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు పనులను నిలిపివేసే పరిస్థితికి తీసుకొచ్చారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండి పడ్డారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఆగిపోయేలా చేయొద్దని హితవు పలికారు. రాయలసీమ..ఉత్తరాంధ్రలో సాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు నీరందించేందుకు తాము ప్రారంభించిన ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా నిలిపివేస్తామని చెప్పటం సరికాదన్నారు చంద్రబాబు. ప్రజా ప్రయోజనాల కోసం చేపట్టే పనులు నిలిపేయడం సమర్థనీయం కాదని అభ్యంతరం వ్యక్తం చేసారు. ప్రభుత్వాలు మారినా, ఎవరు అధికారంలోకి వచ్చినా అభివృద్ధి పనులు నిలిపేయడం మంచిది కాదని చెప్పారు. పీపీఏలను రద్దుచేయాలని జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి అభ్యంతరం చెప్పారని తెలిపారు.
జగన్ ఆ ప్రయత్నం చేయటం లేదు..
పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ తీరును చంద్రబాబు తప్పు బట్టారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్రానికి అప్పజెప్తామన్నారని... మళ్లీ మేమే చేస్తామంటున్నారని చంద్రబాబు వివరించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం కారణంగా రైతులు ఇప్పటికే ఒక సీజన్ కోల్పోయారని... కేంద్రం నుంచి రావాల్సిన రూ.4వేల కోట్లను తీసుకొచ్చే ప్రయత్నం చేయడం లేదన్నారు. రైతులకు రుణమాఫీ నాలుగు, ఐదో విడత బకాయిలు చెల్లించాలి. ఖరీఫ్లో రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయం నిలిపేయడం సరికాదుఅని చంద్రబాబు విమర్శించారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోని పనుల్ని తెదేపా ప్రభుత్వం ప్రాధాన్య క్రమంలో చేపట్టింది. అందులో కొన్నింటిని పూర్తిచేసింది. మరికొన్ని పనులు చివర దశకు చేరాయి. ఇప్పుడు వాటి పనుల్ని నిలిపేసి అవినీతి బురద జల్లడం తగదని చంద్రబాబు పేర్కొన్నారు.
టీడీపీ పై అవినీతి ముద్ర వేసేందుకే..
కొత్త ప్రభుత్వం అసత్య ఆరోపణలతో హడావుడి చేసేందుకు ప్రయత్నిస్తోందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెదేపా ప్రభుత్వ పెద్దలపై అవినీతి ముద్ర వేసేందుకే టెండర్ల విషయం తెరపైకి తెచ్చిందని సమావేశంలో పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. తెదేపా పాలనలో అవినీతి జరిగితే విచారణ చేసుకోవచ్చు కానీ, ఆ పేరుతో అభివృద్ధి ఆగిపోకూడద న్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా అభివృద్ధిని పక్కకు పెట్టడం సబబు కాదన్నారు. అన్నదాతా సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఖరీఫ్కే నగదు ఇద్దామనుకున్నామని, ఇప్పుడు వైకాపా ప్రభుత్వం ఆ పథకం పేరు మార్చి అంతకంటే తక్కువ మొత్తం రబీకి ఇస్తామంటోందని వారు పేర్కొన్నారు. పార్టీ నేతలు ఎక్కువ కాలం మౌనంగా ఉండడం మంచిది కాదని కొందరు అభిప్రాయపడ్డారు. బాధ్యతాయుత ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సహకరిస్తామని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో తోడుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.