వైసీపీ ఎలా చేయగలిగింది : ఓటర్లు ఎవరి వైపు నిలిచారు: నేటి నుండి చంద్రబాబు సమీక్షలు..!
ఏపిలో పోలింగ్ ముగిసింది. మరి కొద్ది రోజుల్లో ఫలితాలు రానున్నాయి. విజయం పైన పైకి ధీమాగా కనిపిస్తున్నా..ఇంకా లోపల ఎక్కడో అనుమానం. నిజంగా వృద్దులు..మహిళలు ఎవరి వైపు నిలిచారు. ఈ సందేహాల నడుమ టీడీపీ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు సమీక్షలు ఏర్పాటు చేసారు. పోలింగ్ నాడు నియోజకవర్గాల వారీగా సరళి ఎలా ఉంది..వైసీపీ నేతలు ఏం చేసారు..కౌంటింగ్ రోజు ఏం చేయాలనే దాని పైన మార్గదర్శకం చేయనున్నారు...
వైసీపీ ధీమా పైనే చర్చ...
పోలింగ్ ముగిసి తరువాత వైసీపీ అధినేత జగన్ అదే రోజు రాత్రి తమ విజయం ఖాయమని..లాండ్స్లైడ్ విక్టరీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేసారు. టిడీపీ అధినేత సైతం తాము 130 పైగా సీట్లలో విజయం సాధిస్తామని చెప్పుకొచ్చారు. ఇక, అనేక సర్వేలు వైసీపీకి అనుకూలంగా వస్తున్న పరిస్థితుల్లో టిడీపీ అధినేత మంత్రి పార్టీ నేతలతో టెలి కాన్ఫిరెన్స్లో.. మీడియా సమావేశాల్లో పోలింగ్ సరళి పూర్తిగా టీడీపీకే అనుకూలంగా ఉందని చెబుతున్నారు. టిడీపీకి అనుకూలంగా సైలెంట్ ఓటింగ్ జరిగిందని విశ్లేషిస్తున్నారు. ఆ సరళి ఎవరికీ అర్దం కాదని..ఫలితాలు వచ్చిన రోజు మాత్రమే నిజమని నమ్ముతారంటూ చంద్రబాబు చెబుతున్నారు. అయితే, ఇదే సమయంలో వైసీపీ ధీమా పైకి మేకపోతు గాంభీర్యమా..లేక నిజమైన ధీమానా అనే కోణంలోనూ విశ్లేషణ చేస్తున్నారు. దీని కోసం ప్రధానంగా నియోజకవర్గాల వారీగా పోలింగ్ సరళి గురించి విశ్లేషించటంతో పాటుగా.. ప్రత్యర్ధి పార్టీ ఏరకంగా వ్యవహరించిందీ.. వారు అనుసరించిన వ్యూహాల పైన ఇప్పుడు ఆరా తీస్తున్నారు.
నేటి నుండి సమీక్షలు..
నేటి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారు. తొలి రోజు రాజమండ్రి లోక్సభ నియోజకవర్గంతో పాటుగా పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమీక్ష చేయనున్నారు. ఈ నెల 22వ తేదీ వరకు ఈ సమీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం..సాయంత్రం రెండు లోక్సభ నియోజకవర్గాల వారీగా ఈ సమీక్షలు జరగనున్నాయి. మంగళగిరి సమీపంలోని హ్యాపీ రిసార్ట్స్లో ఈ సమావేశాలు ఏర్పాటు చేసారు. తొలుత పోటీ చేసిన పార్టీ అభ్యర్దులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్నారు. తర్వాత నియోజకవర్గానికి 50 మంది చొప్పపున ఏడు నియోజకవర్గాల నుండి పిలిపించిన వారితో చంద్రబాబు భేటీ అవుతారు. ఇందు కోసం నియోజకవర్గంలో పార్టీ తరపున ఎన్నికల కోసం పని చేసిన వారిని ఎంపిక చేసారు. ఇప్పటికే అనేక సర్వే సంస్థల ద్వారా తన వద్ద ఉన్న సమాచారం వారితో షేర్ చేసుకోవటంతో పాటుగా..వారి వద్ద నుండి క్షేత్ర స్థాయి సమాచారం క్రోడీకరించి అక్కడి పోలింగ్ సరళి ఆధారంగా ఓ అంచనాకు రానున్నారు.
కీలక సూచనలు..హెచ్చరికలు..
ఎన్నికల్లో నియోజకవర్గాల్లో అభ్యర్దులు ఎదుర్కొంటున్న పరిస్థితులతో పాటుగా ఏ విధంగా పరిస్థితిని చక్కదిద్దుకోవాలో పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి అభ్యర్దులకు సూచనలు వెళ్లాయి. అయితే, కొందరు అభ్యర్దులు వారిచ్చిన సమాచారం పట్టించుకోలేదు. దీని పైన చంద్రబాబు సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా కొందరు అభ్యర్దులు తమకు ఎంపీ అభ్యర్దుల నుండి సహకారం ఏ విధంగానూ అందలేదనే ఫిర్యాదులు చేసారు. వారి సమక్షంలోనే వాస్తవాలను తెలుసుకోనున్నారు. ఇక, వైసీపీ అమలు చేసిన వ్యూహాలను టిడీపీ ఎందుకు చేయలోక పోయిందనే కోణంలోనూ చర్చ జరుగుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక, కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన చర్యలు..జాగ్రత్తలతో పాటుగా, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా మార్గదర్శకం చేయనున్నారు.