జగన్కూ అంతేగా..నేడు చంద్రబాబు: విమానాశ్రయంలో సీన్ రివర్స్: కాలం మారింది బ్రదర్..!
టీడీపీ అధినేత చంద్రబాబును చెక్ చేస్తారా..ఆయన కారును విమానాశ్రయంలోకి రానివ్వరా..అంటూ టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. జెడ్ ప్లస్ వీఐపీ భద్రత ఉన్న నాయకుడితో ఇలాగేనా వ్యవహరించేదీ అంటూ మండిపడుతున్నా రు. ఇక ఇదే విషయం పైన కేంద్ర పౌర విమానయాన శాఖ స్పష్టమైన నిబంధనలను రూపొందించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి.. గత కొద్ది రోజుల వరకూ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ సైతం ఈ చెకింగ్ల తరువాతనే విమానం ఎక్కేవారు. ఇప్పుడు అదే హోదాలో ఉన్న చంద్రబాబును నిబందనల ప్రకారమే తనిఖీలు చేసారు. అసలు..పౌర విమానయాన శాఖ రాష్ట్ర స్థాయి ప్రతిపక్ష నేతలకు ఇచ్చే ప్రాధాన్యత గురించి ఏం చెబుతుందంటే..
చంద్రబాబును చెక్ చేసి ఇలా..
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గతం కంటే భిన్నమైన పరిస్థితి ఎదురైంది. విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే సమయంలో గన్నవరం విమానాశ్రయం లోపలకు ఆయన కారును అనుమతించలేదు. సాధారణ ప్రయాణీకుల తరహా లోనే చంద్రబాబు సైతం విమానం ఎక్కే ప్రాంతానికి అక్కడ సిద్దం చేసిన బస్సులో వెళ్లారు. అదే సమయంలో ఏయిర్ పోర్టులో మెటల్ డిటెక్టర్ తనిఖీలు చేసారు. ఆ తరువాత సాధారణ ప్రయాణీకులతో కలిసి విమానం ఎక్కారు. ఇక, దీని పైన టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.జెడ్ ప్లస్ వీఐపీ భద్రత ఉన్న నాయకుడితో ఇలాగేనా వ్యవహరించేదీ అంటూ నిలదీస్తున్నారు. అయితే, దీని పైన విమానాయాన శాఖ ఎప్పటి నుండో ఇక విధాన పరమైన నిర్ణయాలను అమలు చేస్తోంది. ప్రోటోకాల్ విషయంలో ఎలా వ్యవహరించాలో తమ సిబ్బందికి స్పష్టం చేసింది.
జగన్కూ అదే తరహాలో..
ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కాదు. ఏపీ రాష్ట్ర ప్రతిపక్ష నేత. అయితే, విమానయాన శాఖ నిబంధనల ప్రకారం రాష్ట్ర స్థాయి ప్రతిపక్ష నేతకు ప్రత్యేకంగా ప్రోటోకాల్ ఉండదు. సాధారణ ప్రయాణీకుడి తరహలోనే విమానాశ్రయంలో ట్రీట్ చేస్తారు. కొద్ది రోజుల క్రితం వరకు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ సైతం విమానాశ్రయంలో సాధారణ ప్రయాణీకుడి తరహాలోనే వ్యవహరించారు. అయితే, అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ప్రత్యేక విమానంలో ప్రయాణాలు చేసి.. నేరుగా విమానం వద్దకే తన కాన్వాయ్ను తీసుకెళ్లటం..ఇదే పదే పదే చూసిన టీడీపీ నేతలకు ఇప్పుడు జరిగిన తీరు కొత్తగా కనిపిస్తోంది. వేధింపుల్లో భాగంగా అర్దం అవుతుంది. కానీ, పౌర విమానయాన శాఖ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంకు ఉండే ప్రాధాన్యత విమానాశ్రయంలో ప్రతిపక్ష నేతకు ఉండదని తేల్చింది. ప్రొటోకాల్ ప్రకారం డిప్యూటీ సీఎంకు తనిఖీలు ఉండవు. కానీ, ప్రతిపక్ష నేతను తనిఖీ చేసిన తరువాతనే అనుమతించాలని స్పష్టం చేస్తోంది. అది కేవలం ఏపీకే పరిమతం కాదు. దేశం మొత్తం ఒకటే విధానం.
కేంద్రం చేతిలో విమానాశ్రయం..
టీడీపీ నేతలు తమ అధినేతను విమానాశ్రయంలో తనిఖీలు చేయటాన్ని జీర్ణించుకోలేక ఆరోపణలు మొదలు పెట్టారు. అయితే, విశాఖ విమానాశ్రయంలో నాటి ప్రతిపక్ష నేత జగన్ పైన దాడి చేసిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక విషయాన్ని చెప్పుకొచ్చారు. విమానాశ్రయంలో ఏం జరిగినా అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసారు. ఇప్పుడు, చంద్రబాబు ప్రోటోకాల్ తో సహా..తనిఖీలు మొత్తం కేంద్ర బలగాల పర్యవేక్షణలోనే జరుగు తాయనే విషయం వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే, అధికారం పోగానే ఇంత తొందరగా సీన్ రివర్స్ అవుతుందని టీడీపీ బ్రదర్స్ అంచనా వేయలేకపోయారు. గతంలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉండగా..తనిఖీలు చేస్తున్న ఫొటోలను విడుదల చేసారు. మరి..ఇప్పుడు టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.