సీఎం టూర్కు అధికారులు గైర్హాజరు: 70 శాతం పోలవరం పూర్తయింది..చంద్రబాబు..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల కోడ్ ఉన్నా పోలవరం క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లారు. ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించారు. స్పిల్వే, కాపర్ డ్యామ్ పనులను పరిశీలించారు. పోలవరం పనులు 70 శాతం పూర్తయినట్లు ప్రకటించారు. 2020 నాటికి గ్రావిటీ ద్వారా నీరు ఇస్తామన్నారు. అయితే, ముఖ్యమంత్రి పర్యటనకు జనవనరుల శాఖ కార్యదర్శి..గోదావరి జిల్లాల కలెక్టర్లు గైర్హాజరయ్యారు.
పోలవరం 70 శాతం పూర్తి..
ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం పనులను పరిశీలించారు. ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించారు. స్పిల్వే, కాపర్ డ్యామ్ పనులను పరిశీలించారు. పోలవరం వ్యూ పాయింట్ నుంచి పనులు పరిశీలించారు. పోలవరం మెయిన్ డ్యామ్ వద్ద గేట్ల బిగింపు పనులపై ఆరా తీశారు. వీలైనంత త్వరగా మిగిలిన గేట్ల బిగింపు పనులు పూర్తి చేయాలని చంద్రాబాబు సూచించారు. పోలవరం పనులు ఇప్పటివరకు 70.17శాతం పూర్తి చేశామని, ఇప్పటివరకు 90సార్లు వర్చువల్ ఇన్స్ఫెక్షన్ చేశామన్నారు. పోలవరం ద్వారా 45లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని, పోలవరం పూర్తయితే కరువును జయించవచ్చన్నారు. ఈ ఏడాది గ్రావిటీ ద్వారా సాగునీరందిస్తామని చంద్రబాబు చెప్పారు.
అధికారుల గైర్హాజరు..
ముఖ్యమంత్రి పోలవరం పర్యటన గురించి రెండు రోజుల క్రితమే సమాచారం ఇచ్చారు. అయితే, కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఆంక్షలు ఉన్నాయని అధికారులు వివరించారు. అయితే, ప్రాజెక్టు పరిశీలనకు కోడ్ అడ్డంకి కాదనే అభిప్రాయంతో ముఖ్యమంత్రి పర్యటన ఖరారు చేసుకున్నారు. ప్రాజెక్టు వద్దకు ముఖ్యమంత్రి చేరుకున్న సంబంధిత అధికారి అయిన జనవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ హాజరు కాలేదు. అదే విధంగా..ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు సైతం గైర్హాజరయ్యారు. మంత్రి దేవినేని ఉమా పనులను వివరించారు. చంద్రబాబు పర్యటనలో పరిమిత సంఖ్యలోనే అధికారులు హాజరయ్యారు. ఈఎన్సీ వెంకటేశ్వరరావు, పోలవరం సీఈ శ్రీధర్ మాత్రమే హాజరయ్యారు. దీంతో..ఇప్పుడు ముఖ్యమంత్రి తాను అనుకున్న విధంగా ముందుకు వెళ్తున్నా..అధికారులు మాత్రం రిస్క్ తీసుకోవటానికి ఇష్టపడటం లేదు.
ఒక్క సారి ఆగితే కొలాప్స్ అవుతుంది..
పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా..త్వరత గతిన పూర్తి చేసేందుకు తాము బాధ్యతలు తీసుకున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. ఇప్పటికే కేంద్రం నుండి నిధులు రావాల్సి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్ట ఎన్నికల కారణంగా రెండు నెలల పాటు పనులు ఆలస్యం అయ్యాయని చెప్పుకొచ్చారు. పనులను నిర్లక్ష్యం చేసి..ఒక్కసారి నిలిచిపోతే..పూర్తిగా ప్రాజెక్ట్ కొలాప్స్ అవుతుందని ఆందోళన వ్యక్తం చేసారు. కేంద్ర నిధులు గురించి సమస్య రాదని.. కేంద్రంలో ప్రభుత్వం మారుతుందని చెప్పుకొచ్చారు.