జేసీ, కేశినేని, నారాయణ, సీఎం, సుజనలకే ప్రభుత్వ సంస్థలు! బాబు తీరుపై జగన్ నిప్పులు
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు. చంద్రబాబు వైఖరిని అందరూ ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
సోమవారం ఉదయం గుంటూరులో రైతు దీక్షలో పాల్గొనేందుకు వచ్చిన జగన్ మొదట బస్టాండ్లో జరిగిన మే డే ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండా ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు.
చంద్రబాబునాయుడు.. ఆర్టీసీని అమ్మేయడమో లేదా ఆ పార్టీ ఎంపీలు కేశినేని నాని, లేక జేసీ దివాకర్ రెడ్డికి కట్టబెట్టడమో చేస్తారని జగన్ ఎద్దేవా చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల, కళాశాలలను విడతలవారీగా మూసివేస్తున్నారని, వాటన్నింటిని మంత్రి నారాయణకు ఇచ్చేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్స్కోలను ఆ పార్టీ ఎంపీలైన సీఎం రమేష్కో.. సుజనా చౌదరికో.. ఇస్తారని వైయస్ జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనలో కార్మికుల్లో అభద్రతా భావం నెలకొందని అన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేస్తామన్న హామీ ఏమైందని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు.