జగన్ కు ఈ ఏడాది ఖచ్చితంగా స్పెషల్..పి.కె : చంద్రబాబు- కవిత శుభాకాంక్షలు...
వైసిపి అధినేత జగన్ కు జన్మదినం సందర్బంగా శుభాకాంక్షలు వెల్లు వెత్తాయి. పార్టీ నేతలు..కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియచేసారు. పలువురు రాజకీయ ప్రముఖులు సైతం శుభాకాంక్షలు తెలిపారు. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు.. టిఆర్యస్ ఎంపి కవిత ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియ చేసారు. ఇదే సమయంలో..పి.కె చేసిన ట్వీట్ ఇప్పుడు వైసిపి నేతల్లో కొత్త ఆలోచనలకు కారణమవుతోంది.
వైయస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజు సందర్భంగా వైఎస్ జగన్గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు... ఆయన ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. శుభాకాంక్షలు తెలిపినందకు ధన్యవాదాలు చంద్రబాబునాయుడుగారు అంటూ వైఎస్ జగన్ బదులిచ్చారు.
వైఎస్ జగన్ ఆయురారోగ్యాలతో, నిండునూరేళ్లు జీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అని మంత్రి గంటా శ్రీనివాస రావు ట్వీట్ చేశారు. ఇక, టిఆర్యస్ ఎంపి కవిత సైతం జగనన్న కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసారు. సమాధానంగా కవితమ్మా..థాంక్యూ అంటూ జగన్ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.
ఇక, వైసిపి కి రాజకీయ సలహా దారుడిగా వ్యవహరించిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైసిపి శ్రేణు ల్లో..జగన్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం తీసుకొస్తోంది. ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా..ఈ ఏడాది మీకు, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు నిజంగా ప్రత్యేకమైందిగా ఉండబోతోందనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలనని పేర్కొంటూ జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ..జగన్ ప్రత్యేకమైనది అంటూ ట్వీట్ చేయటం అంటే..ఖచ్చితంగా అది జగన్ లక్ష్యం నెరవరే విషయమని వైసిపి శ్రేణులు భావిస్తున్నారు. ఇప్పుడు దీని పై పార్టీలో..అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.