మీరు చెబితేకానీ తెలియదా?....ఊరికే ఇలా గలాటా చేయడం తప్పు తమ్ముళ్లు:సిఎం చంద్రబాబు
Recommended Video
విశాఖపట్టణం:స్వచ్ఛమైన మనుషులు మీరు...అడవితల్లి వారసులు మీరు. మీకు ఎంత చేసినా తక్కువే అవుతుంది. మీ అందరికీ కనీస సదుపాయాలు కల్పించడానికి రూ.2,564 కోట్లు ఖర్చు చేసి మీ రుణం తీర్చుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజనులకు హామీ ఇచ్చారు.
గురువారం విశాఖ జిల్లా పాడేరులో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులకు 50 ఏళ్లకే సామాజిక భద్రత పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇళ్ల నిర్మాణానికి ప్రస్తుతం ఇస్తున్న మొత్తానికి అదనంగా ఆదివాసీలకు రూ.లక్ష, గిరిజనులకు రూ.75వేలు, మైదాన ప్రాంత గిరిజనులకు రూ.50 వేల చొప్పున అందజేస్తామని చెప్పారు.
గిరిజనులకు...వరాల జల్లు
గిరిజనులకు మరెన్నో అభివృద్ది ఫలాలు అందించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు...."గిరిబాట పేరుతో అన్ని గ్రామాలను ప్రధాన రహదారులతో అనుసంధానం చేస్తా...గిరినెట్ పేరుతో గిరిసేవా కేంద్రాలను ఏర్పాటు చేయిస్తా...మారుమూల గ్రామాలకు సమాచార వ్యవస్థను విస్తరించడం కోసం 230 టవర్లను నెలకొల్పుతా...దీని కోసం రూ.329 కోట్లు ఖర్చు చేస్తున్నాం...గృహ నిర్మాణాలకు అదనపు సాయం అందిస్తాం... విద్య, వైద్య రంగాలకు రూ.కోట్లలో ఖర్చుచేసి మీ అందరి జీవితాల్లో వెలుగులు తీసుకొస్తాం" అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.
నాకు తెలియదా?....గలాటా చేయడం తప్పు
2014 వరకూ కేవలం 35వేల మందికి 1.64 లక్షల ఎకరాలకు సంబంధించి ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇస్తే, తాము అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో 58,312 మందికి 5.10 లక్షల ఎకరాల పోడు భూములపై హక్కులు కల్పించినట్లు చంద్రబాబు తెలిపారు. ముఖ్యమంత్రి ఇలా మాట్లాడుతుండగా గిరిజన విశ్వవిద్యాలయం, బాక్సైట్ గురించి స్పష్టమైన హామీ ఇవ్వాలని గిరిజన సంఘం, ఎస్ఎఫ్ఐకి చెందిన కొంత మంది నినాదాలు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు..."మీరు చెబితేకానీ తెలియదా?...గిరిజన విశ్వవిద్యాలయం విజయనగరంలో ఏర్పాటవుతుంది...బాక్సైట్ తవ్వకాలను అడ్డుకున్నది నేనే...ఏదో ఊరికే ఇలా గలాటా చేయడం తప్పు తమ్ముళ్లు"...అని హితవు పలికారు.
బాక్సైట్ తవ్వకాలు...వైఎస్సే
బాక్సైట్ తవ్వకాలకు 2007లో వైఎస్ రాజశేఖర్రెడ్డి అనుమతులిచ్చారని...పెన్నా ప్రతాప్రెడ్డి, రస్ఆల్ఖైమా, జిందాల్ కంపెనీలకు దొడ్డిదారిన దోచిపెట్టడానికి, గిరిజనుల హక్కులను కాలరాయడానికి అప్పటి పాలకులే కుట్ర పన్నారని చంద్రబాబు చెప్పారు. అరకులో 887 ఎకరాలు, జర్రెలలో 3000 ఎకరాలు, సప్పర్లలో 4,570 ఎకరాలు వారికి కట్టబెట్టేశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉండి అడ్డుకోవడానికి ఎన్నో విధాలా పోరాడాం...అయినా ఒప్పందాలు చేసుకున్నారు. నేను అధికారంలోకి వచ్చిన తరువాతే బాక్సైట్ అనుమతులను రద్దు చేశా...కేంద్రం మాపై ఒత్తిడి తెస్తోంది... అయినా గిరిజనుల మనోభావాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ వ్యవహరించదని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
భూములపై...ఆదాయం
గిరిజనులకు భూములివ్వడమే కాదు ఆ భూముల నుంచి అధిక ఆదాయం పొందేలా చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అలాగే పాడి పరిశ్రమతో 12వేల మంది గిరిజన రైతులకు ఉపయోగపడేలా బైపా కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని...దీనికోసం రానున్న మూడేళ్లలో రూ.244 కోట్లు ఖర్చు చేయనున్నామని చెప్పారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా అటవీ ఉత్పత్తులను సేకరించి అదనపు విలువలను జోడించడం ద్వారా ఎక్కువ ఆదాయం పొందవచ్చని చంద్రబాబు తెలిపారు. అజీమ్ ప్రేమ్జీ నేతృత్వంలోని విప్రో కంపెనీతో మన్యం ప్రాంతంలో గిరిసేవా కేంద్రాలు ఏర్పాటు చేయడానికి రూ.40 కోట్లతో ఈ సందర్భంగా ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం మన్యంలోని మారుమూల గ్రామాల్లో ఏర్పాటు చేసే టవర్లను ఉపయోగించుకుని గిరిసేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ఏజెన్సీ వ్యాప్తంగా సమాచార వ్యవస్థ మెరుగుపడుతుందని సిఎం చంద్రబాబు చెప్పారు.