కర్నూల్ నేతలకు బాబు షాక్: ఓట్లు తగ్గితే చర్యలు, 23న ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక
అమరావతి: కర్నూల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార టిడిపిలో నేతలు పోటీ పడుతున్నారు. ఎన్నికల్లో పోటీ కోసం నేతల మధ్య పోటీ ఎక్కువైంది,.ఏకాభిప్రాయం రాలేదు. పార్టీ నేతలంతా నాలుగు గ్రూపులుగా విడిపోయి తాము బలపర్చే అభ్యర్థులకు టిక్కెట్ వచ్చేలా చక్రం తిప్పుతున్నారు. అయితే అభ్యర్థి ఎంపిక కోసం నేతలంతా ఏకాభిప్రాయానికి వచ్చి డిసెంబర్ 23వ, తేదిన తనను కలవాలని చంద్రబాబునాయుడు సూచించారు.
కర్నూల్ జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి 2018 జనవరి 12వ, తేదిన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిడిపిలో చాలా మంది పోటీ పడుతున్నారు. డిసెంబర్ 16వ, తేదిన చంద్రబాబునాయుడు మంత్రులు, కర్నూల్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. కానీ, ఏకాభిప్రాయం కుదరలేదు. అర్ధరాత్రి 12 గంటల వరకు సమావేశం నిర్వహించినా నేతల మధ్య ఏకాభిప్రాయం రాలేదు.
కర్నూల్ ఎమ్మెల్సీ ఎన్నికలు: వరుస ఓటములతో వైసీపీకి అగ్ని పరీక్ష, అభ్యర్థెవరు?
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేతల సమిష్టిగా పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. అభ్యర్థి ఎంపికపై ఈ నెల 23న, సమావేశం కావాలని నిర్ణయించారు.
ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం పోటాపోటీ
కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిడిపి నేతలు పోటీ పడుతున్నారు. ఏపీఎస్ఐడీసీ చైర్మన్ కేఈ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణా రెడ్డి, నందికొట్కూరు ఇన్చార్జిఎం. శివానందరెడ్డి పోటీ చేస్తున్నారు.నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు, పారిశ్రామికవేత్త శ్రీధర్రెడ్డి తదితరులు తీవ్రంగా టిక్కెట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.ఎవరికీ వారుగా తమకే టిక్కెట్టు దక్కేలా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
12 దాటినా నేతల మధ్య కుదరని ఏకాభిప్రాయం
డిసెంబర్ 16వ, తేదిన ఏపీ మంత్రివర్గం ముగిసిన తర్వాత కర్నూల్ జిల్లాకు చెందిన మంత్రులు, పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కర్నూల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి విషయమై నేతల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. ఎవరికి వారు తమ వర్గానికే టిక్కెట్టు దక్కేలా విశ్వ ప్రయత్నం చేశారు. దీంతో చంద్రబాబునాయుడు అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం.
కర్నూల్ నేతలతో బాబు విడి విడిగా అభిప్రాయ సేకరణ
కర్నూల్ జిల్లా నేతలతో పార్టీ నేతలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కసరత్తు నిర్వహించారు. జిల్లాకు చెందిన మంత్రులు, పార్టీ నేతలతో టిడిపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, కర్నూల్ జిల్లా ఇంచార్జీ మంత్రి కాలువ శ్రీనివాసులు నేతలతో విడివిడిగా చర్చించారు.నేతల అభిప్రాయాలను చంద్రబాబునాయుడుకు సమర్పించారు.
చల్లా రామకృష్ణారెడ్డి ప్రయత్నాలు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్ధన్రెడ్డి చల్లా రామకృష్ణారెడ్డికి బహిరంగంగానే మద్దతును ప్రకటించారు. తనకు మద్దతు ఇవ్వాలని జిల్లా నాయకులను చల్లా రామకృష్ణారెడ్డి కోరారని సమాచారం.అయితే నేతల మధ్య ఏకాభిప్రాయం మాత్రం రాలేదు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు తగ్గితే చర్యలు తప్పవని బాబు హెచ్చరిక
నియోజకవర్గాల వారీగా స్థానిక సంస్థల ఓట్ల వివరాలు అడిగారు. ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు వివరాల నుండి తెలుసుకొన్నారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఎన్నికలో టీడీపీకి 750-800 ఓట్లు రావాలని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.ఎందుకు ఓట్లు తగ్గాయని బాబు పార్టీ నేతలను ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో అందరూ కలసికట్టుగా పనిచేయాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో తాను కఠినంగా ఉంటానన్నారు.