జగన్, పవన్లతో కలిసి కేంద్రం డ్రామా, వారికి హామీ: చంద్రబాబు ఆగ్రహం
Recommended Video
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్లతో కలిసి కేంద్రం డ్రామాలు ఆడుతోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంపై ఆయన మరోసారి నిప్పులు చెరిగారు.
ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం పవన్ కల్యాణ్కు హమీ ఇచ్చిందని ఆయన అన్నారు. అదే సమయంలో అవిశ్వాసం ప్రతిపాదించి, ఎంపీలతో రాజీనామాలు చేయిస్తే ప్రత్యేక హోదా ఇస్తామని జగన్కు కేంద్రం హామీ ఇచ్చిందని అన్నారు.
ఎపిపై కేంద్రం కుట్ర చేస్తోంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యతిరేకంగా కేంద్రం కుట్ర చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. వైసిపికి సహకరిస్తానని పవన్ కల్యాణ్ చెప్పినట్లు వైఎస్సాఆర్ కాంగ్రెసు పార్టీ ఎంపీ వరప్రసాద్ డ్రామా ఆడుతున్నారని అన్నారు. కేంద్ర వైఖరిపై ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.
అది దొంగల పార్టీ
వైఎస్సార్ కాంగ్రెసు దొంగల పార్టీ అని, అటువంటి పార్టీ పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని చంద్రబాబు అన్నారు. పిఎంవో పవిత్ర కార్యాలయమని, అటువంటి పవిత్ర కార్యాలయంలోకి ఎ1 నిందితుడు జగన్కు,, ఎ2 నిందితుడు విజయసాయి రెడ్డికి ప్రవేశం కల్పించారని అన్నారు.
అందుకే ప్రత్యేకంగా తీర్మానం
ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే భావనతోనూ కేంద్రం డ్రామా వల్ల తాము ప్రత్యేకంగామోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని నిర్ణయించుకున్నట్లు చంద్రబాబు చెప్పారు. వైసిపి ప్రతిపాదించిన తీర్మానంపై ఐదుగురే సంతకాలు చేశారని, తాము ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై 16 మంది ఎంపీలు సంతకాలు చేశారని ఆయన చెప్పారు.
ప్రకటనకు అవకాశం ఇవ్వరా...
రాజీనామాలు చేసిన కేంద్ర మంత్రులకు సభలో ప్రకటన చేయడానికి అవకాశం ఇవ్వరా అని చంద్రబాబు ప్రశ్నించారు. నీరవ్ మోడీ లాంటి నేరస్థులు దేశం దాటి పోతున్నారని ఆయన కేంద్రంపై మండిపడ్డారు.
మోడీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తోంది..
రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయడానికి బదులు కేంద్రం పవన్ కల్యాణ్, జగన్లతో కుమ్మక్కయి తమకు వ్యతిరేకంగా పనిచేస్తోందని చంద్రబాబు అన్నారు. ఎన్డీఎ నుంచి వైదొలగడానికి కారణాలు చెబుతూ ఆయన ఆ విమర్శలు చేశారు. తాము ఆత్మగౌరవం కోసం, తెలుగు ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్నామని చెప్పారు. బిజెపి కుమ్మక్కు రాజకీయాలను భవిష్యత్తులో మరింత పెంచే ప్రమాద ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మోడీని కూడా ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.