చంద్రబాబుకు తెలియకుండా చేశాం, పవన్ చెప్పింది వింటాం: నారాయణ సంచలనం
గుంటూరు: భూసేకరణ బిల్లు విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలియదని మంత్రి నారాయణ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. శుక్రవారం నాడు ఆయన విలేకరులతో మట్లాడారు. సీఎం చంద్రబాబు దృష్టికి తేకుండానే భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చామన్నారు.
ఇప్పుడు భూసేకరణ బిల్లు పైన తాము వెనక్కి తగ్గుతున్నామని చెప్పారు. సీఎం చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
రెండు రోజుల్లో గ్రామ కంఠాల పైన తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి పీ నారాయణ చెప్పారు. భూసేకరణ నోటిఫికేషన్ అనంతరం భూసమీకరణ ద్వారా మరో వెయ్యి ఎకరాలను తాము సేకరించామని ఆయన తెలిపారు. రైతులను ఒప్పించి భూమిని సేకరిస్తామన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి నుంచీ భూసేకరణ వద్దంటున్నారని, ఐనా సమయం ముంచుకొస్తుండటంతో తాను భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయించానని నారాయణ చెప్పారు.
భూసేకరణకు చంద్రబాబు వ్యతిరేకమని, ఎట్టి పరిస్థితుల్లోనూ సమీకరణ విధానంలోనే రైతులను ఒప్పించి భూములను తీసుకోవాలన్నదే ఆయన అభిమతమన్నారు.
పవన్ కళ్యాణ్, చంద్రబాబులు చెప్పినట్టుగా భూములిచ్చేందుకు అందరు రైతులనూ ఒప్పిస్తామన్నారు. వారి ఇష్ట ప్రకారమే భూములు తీసుకుంటామని చెప్పారు. ఎవరినీ బలవంతం పెట్టబోమన్నారు. గ్రామకంఠాలపై రైతుల్లో ఆందోళన వద్దన్నారు.
రేపటి బంద్కు సహకరించండి: జగన్ పిలుపు
ప్రత్యేక హోదా కోసం ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకోవద్దని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. పోరాటాల ద్వారానే ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకుందామన్నారు. రేపు తాము తలపెట్టిన ఏపీ బంద్కు అందరూ మద్దతు పలకాలని కోరారు.
శుక్రవారం ఉదయం ఎస్పీఎస్ నెల్లూరు వచ్చిన జగన్.. ప్రత్యేక హోదా కోసం గురువారం ఆత్మహత్య చేసుకున్న లక్ష్మయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. రేపటి బంద్ను అడ్డుకుంటే సీఎం చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారన్నారు.