ఎస్సీ, ఎస్టీలకు '50 యూనిట్ల' ఫ్రీ కరెంట్ : చంద్రబాబు, అమెరికా పర్యటన వాయిదా
విజయవాడ : సంక్షేమ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ సందర్బంగా.. ప్రభుత్వం చేపడుతోన్న పలు సంక్షేమ పథకాల గురించి వివరించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అలాగే రాబోయే రోజుల్లో ఎస్సీ, ఎస్టీలకు నెలకు 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ప్రభుత్వం సరైన రీతిలో వినియోగిస్తోందని తెలిపారు.
కాగా, టీడీపీ అధికారంలోకి వచ్చాక.. బీసీల కోసం సబ్ ప్లాన్ తీసుకొచ్చామని, ముస్లింల సంక్షేమానికి కూడా బడ్జెట్ పెంచామని చంద్రబాబు పేర్కొన్నారు. విద్యార్థులకు ఆర్థిక చేయూతనిస్తున్నామని, నిరుద్యోగ యువతీ యువతులకు నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు శిక్షణ అందిస్తున్నామని తెలియజేశారు. ఉపాధి కల్పన, సివిల్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ అందజేస్తున్నట్లుగా వెల్లడించారు.
మహిళలకు ఆర్థిక స్వావలంబన అందించేందుకు పొదుపు సంఘాలను ప్రోత్సహిస్తున్నామని, సంఘంలో ఉన్నప్రతి మహిళకు రూ. 10 వేల మూలనిధి సాయంగా అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. పేదల సేవనే పరమావధిగా ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి, అధికారి భావించాలని సూచించారు.
చంద్రబాబు అమెరికా పర్యటన వాయిదా :
వచ్చే నెలలో 9 రోజుల పాటు జరగాల్సి ఉన్న సీఎం చంద్రబాబు అమెరికా పర్యటన వాయిదా పడింది. రాష్ట్రంలో పలు ముఖ్య కార్యక్రమాలు చేపట్టాల్సి ఉండడంతో పాటు.. ముందుగా ఖరారు షెడ్యూల్ ప్రకారం.. ఆ సమయంలో అమెరికా అంతటా థ్యాంక్స్ గివింగ్ డే, ఆపై క్రిస్మస్ సెలవులు ఉండడంతో పర్యటనను వాయిదా వేసుకున్నారు.
తాజా సమాచారం చంద్రబాబు అమెరికా పర్యటన ఫిబ్రవరిలో ఉండే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. జనవరిలో విశాఖలో పెట్టుబడుల సదస్సు జరగనుండడం కూడా సీఎం పర్యటన వాయిదాకు మరో కారణం. కాగా, పర్యటన రద్దు విషయాల్ని ప్రభుత్వ ఎన్ఆర్ఐ వ్యవహారాల సలహాదారుడు రవికుమార్ వెల్లడించారు. పర్యటనను వారం లేదా పదిరోజుల పాటు వాయిదా వేయాలని అనుకున్నప్పటికీ.. అమెరికాలోను ఆ సమయంలో వరుస సెలవులు ఉండడంతో.. పర్యటనను ఇప్పటికైతే వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.