సీతానగరం ఘటన: మళ్లీ అనాగరిక పాలనంటూ చంద్రబాబు ఆగ్రహం, ఏపీ డీజీపి సీరియస్
అమరావతి: తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో పోలీస్ స్టేషన్లో యువకుడికి శిరోముండనం చేసిన ఘటనపై నలువైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏపీ సర్కారు తీరుపై మండిపడ్డారు.
అనాగరిక పాలన..
ఇసుక అక్రమ తవ్వకాలను ప్రశ్నించినందుకు వరప్రసాద్ అనే దళితుడ్ని వైసీపీ నేతలు తీవ్రంగా అవమానించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్లో పోలీసుల సమక్షంలోనే వరప్రసాద్కు గుండుకొట్టారని అన్నారు. రాష్ట్రంలో మళ్లీ అనాగరిక పాలన వచ్చిందని ఆరోపించారు.
వైద్యుల నుంచి న్యాయమూర్తుల వరకు దాడులే.
ఆ ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలను ప్రశ్నించడమే వరప్రసాద్ చేసిననేరమైందని ఆక్రోశించారు. ఏపీ పోలీసులకు ఏమైందని ప్రశ్నించారు. వరప్రసాద్ కు టీడీపీ అండగా ఉంటుందన్నారు. ఎస్సీలపై జగన్ ప్రభుత్వ దమనకాండ కొనసాగుతోందని చంద్రబాబు మండిపడ్డారు. వైద్యులు సుధాకర్, అనితా రాణితోపాటు న్యాయమూర్తి రామకృష్ణపైనా భౌతిక దాడులకు పాల్పడినట్లు చంద్రబాబు గుర్తు చేశారు.
ఏపీ డీజీపీ సీరియస్..
సీతానగరం పోలీస్ స్టేషన్లో యువకుడికి శిరోముండనం ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించారు. ఇలాంటి వ్యవహారశైలిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని డీజీపీ స్పష్టం చేశారు. కాగా, ఈ ఘటన స్పందించిన ఉన్నతాధికారులు ఇంఛార్జీ ఎస్ఐతోపాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశారు.
Recommended Video
అందుకే వైసీపీ నేతల దాడి..
కాగా, ఇసుక లారీలు అడ్డుకున్నందుకు తనపై దాడి చేశారని బాధిత యువకుడు ఆరోపిస్తున్నాడు. ఇసుక లారీలను ఆపిన సమయంలో స్థానిక మునికూడలి వద్ద వైసీపీ నాయకుడు కవల కృష్ణమూర్తి కారుతో వచ్చి ఢీకొట్టినట్లు బాధితుడు తెలిపాడు. వెదుళ్లపల్లిలోని బాధితుడు వరప్రసాద్ ఇంటికి వెళ్లి కోరుకొండ డీఎస్పీ విచారణ చేపట్టారు. కాగా, దళిత యువకుడిపై దాడి, శిరోముండనం చేయడంపై మాజీ ఎంపీ హర్షకుమార్, టీడీపీ నేత అనిత వంగలపూడి, కాంగ్రెస్ నేత శైలజానాథ్, వామపక్ష నేత రామకృష్ణలు తీవ్రంగా మండిపడుతున్నారు.