చిన్న ఉద్యోగులపై థర్డ్ గ్రేడ్ కుట్రలా అంటున్న చంద్రబాబు ..ఇదేనా మీ బోడి విశ్వసనీయత అంటున్న లోకేష్
ఆశా వర్కర్ల జీతాలను చెల్లించకుండా వైసీపీ సర్కార్ వేధింపులకు గురి చేస్తుంది అంటూ ఆశా వర్కర్లు తమ డిమాండ్ల సాధన కోసం ఛలో అమరావతి కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే పోలీసులు వారి ఆందోళనను భగ్నం చేశారు. ఎక్కడికక్కడ ఆశా వర్కర్లను అరెస్ట్ చేశారు. దీంతో ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే ఆశా వర్కర్ల కు బాసటగా చంద్రబాబు ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్ పనితీరుపై విరుచుకుపడ్డారు. ఇక లోకేష్ బాబు సైతం తన విమర్శనాస్త్రాలు సంధించి జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
ఒక్కో ఆశా కార్యకర్త పనితీరుపై పదిమంది తీర్పు ఇవ్వాలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన చంద్రబాబు
ట్విట్టర్ లో ట్వీట్ చేసిన చంద్రబాబు ఒక్కో ఆశా కార్యకర్త పనితీరుపై పదిమంది తీర్పు ఇవ్వాలా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు . ఇది వాళ్లను వేధించడానికేనని అని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నెలకు 10 వేలు జీతం ఇస్తామని చెప్పి గ్రేడింగ్ విధానం అమలు చేసే దుర్మార్గపు జీవోలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. ఆశా కార్యకర్తలకు హామీ ఇచ్చినట్టుగా నెలకు రూ.10 వేల జీతం ఎలాంటి షరతులూ లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక అంతే కాదు ప్రభుత్వ ప్రతి ఆలోచనలో ప్రజలను మోసం చేసే కుట్ర ఉండాల్సిందేనా! అంటూ ఆయన మండిపడ్డారు. ఆశా వర్కర్లకు రూ.10 వేల జీతం పెంచేసాం అంటూ ఫోటోలకు ఫోజులా? అని ప్రశ్నిస్తూనే మరో పక్క ఏకంగా ఉద్యోగంలోంచి తీసేసే జీవో ఇస్తారా? అంటూ చంద్రబాబు మండిపడ్డారు . వాళ్ళ కష్టానికి గ్రేడ్ లు ఏంటి? చిన్న చిన్న ఉద్యోగులపై ఇలాంటి థర్డ్ గ్రేడ్ కుట్రలు ఎలా చేయగలుగుతున్నారు? అంటూ ప్రశ్నించారు.
ఆశా కార్యకర్తలను కూడా పెయిడ్ ఆర్టిస్టులంటూ మార్ఫింగ్ కథ చెప్పటం వైసీపీ కి అలవాటే అని చంద్రబాబు ఫైర్
ఆందోళన చేస్తున్న ఆశా కార్యకర్తలను కూడా పెయిడ్ ఆర్టిస్టులంటూ ఏదో ఒక మార్ఫింగ్ కథను వైసీపీ నేతలు సృష్టిస్తారని ఆరోపించారు. మరో ట్వీట్ లో ఒక వేళ మీకు ఇవ్వాలని లేకపోతే మీ ఆయుధం సిద్ధంగానే ఉందిగా, ఇంకా ఆలస్యం ఎందుకు? ఒక్క ఫోన్ కొట్టండి మీ వైసీపీ పేటీఎం బ్యాచ్ కి అంటూ ఎద్దేవా చేశారు . ఆందోళన చేస్తున్న ఆశా కార్యకర్తలను కూడా పెయిడ్ ఆర్టిస్టులే అని ఏదో ఒక మార్ఫింగ్ కథ సృష్టిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలోకి వచ్చినా మీకిది మామూలే కదా! అంటూ జగన్ సర్కార్ పై ధ్వజమెత్తారు. ఆశా వర్కర్ల ఆవేదనకు సంబంధించిన ఓ వీడియో క్లిప్పింగ్ ను కూడా తన ట్వీట్ కు జత చేశారు
వైఎస్ జగన్ విఫలమైన ముఖ్యమంత్రి అంటూ మండిపడుతున్న లోకేష్
ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్ బాబు సైతం ఆశా వర్కర్ల పోరాటానికి స్పందించారు . ట్విట్టర్ లో పోస్ట్ చేసిన లోకేష్ ఎన్నికల సమయంలో అమ్మా ఓటు, అక్కా ఓటు, చెల్లీ ఓటు అని అందరినీ ప్రాధేయపడి ఓట్లేయించుకున్నారంటూ నారా లోకేశ్ ధ్వజమెత్తారు. కానీ, ఓట్లేసిన ఆ మహిళలే ఇప్పుడు ఆందోళన చేస్తుంటే వాళ్ల బాధలు వినకుండా వాళ్ల కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయిస్తున్నారంటూ మండిపడ్డారు. చేతికి మైకు దొరికితే చాలు విశ్వసనీయత అంటారు... ఇదే మీ బోడి విశ్వసనీయత? అంటూ జగన్ పై నిప్పులు చెరిగారు లోకేష్ . ఈ మేరకు ట్వీట్ చేసిన లోకేష్ ఆశా వర్కర్ల ఆవేదనకు సంబంధించిన ఓ వీడియో క్లిప్పింగ్ ను కూడా తన ట్వీట్ కు జోడించి పెట్టి 'వైఎస్ జగన్ విఫలమైన ముఖ్యమంత్రి' అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టారు. మొత్తానికి తండ్రీ కొడుకులు జగన్ సర్కార్ టార్గెట్ గా ఏ చిన్న అంశం దొరికినా వదలకుండా టార్గెట్ చేస్తున్నారు. జగన్ ను ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారు.