టీమ్ఇండియాకు చంద్రబాబు, పవన్ కంగ్రాట్స్- గబ్బా ఫీట్ అద్భుతమంటూ ప్రశంసలు
ఆస్ట్రేలియాపై గబ్బాలో అద్భుత టెస్టు విజయం అందుకున్న టీమ్ ఇండియాపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. రాజకీయ పార్టీల నేతలు పార్టీలకతీతంగా టీమ్ ఇండియాపై హర్షాతిరేకాలు కురిపిస్తున్నారు. గబ్బాలో టీమ్ ఇండియా సాధించిన చారిత్రక విజయంపై ఏపీకి చెందిన నేతలు కూడా వేర్వేరు ప్రకటనల్లో అభినందనలు తెలిపారు.
గబ్బాలో టీమ్ ఇండియా విజయంపై విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇందులో ఆయన గబ్బా కోటను బద్దలు కొట్టడం ద్వారా టీమ్ ఇండియా సిరీస్ విజయం సాధించిందంటూ బాబు ప్రశంసల జల్లు కురిపించారు. ఇదో గుర్తుండిపోయే విజయం అన్నారు. టీమ్ ఇండియా విజయం తర్వాత గబ్బాలో జాతీయ జెండాతో భారత క్రికెటర్లు నడుస్తున్న ఫొటోను కూడా చంద్రబాబు తన ట్వీట్కు జత చేశారు. తద్వారా భారత్ సాధించిన విజయం గొప్పదనాన్ని చంద్రబాబు అందరితో పంచుకున్నారు.
మరోవైపు టీమ్ ఇండియా సాధించిన చారిత్రక గెలుపుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో పవన్ టీమ్ ఇండియా గెలుపు ఓ అద్భుతమన్నారు. ఆస్ట్రేలియాపై వారి దేశంలోనే టీమ్ ఇండియా గెలవడం చారిత్రాత్మకం అంటూ పవన్ పొగడ్తల్లో ముంచెత్తారు.
ఈ ఘనత సాధించిన భారత జట్టుకు నా తరఫున, జనసేన తరఫున అభినందనలు తెలుపుతున్నానన్నారు. ప్రతికూల పరిస్ధితుల్లో సాధించిన ఈ విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. కీలక ఆటగాళ్లు గాయాలపాలైనా అంతర్జాతీయ వేదికలపై తొలి అడుగులు వేస్తున్న క్రీడాకారులు చూపిన ప్రతిభ, కలిసి కట్టుగా విజయం కోసం పోరాడిన విధానం ప్రశంసనీయమని పవన్ తెలిపారు.