డబ్బులు దండుకోడానికే: విశాఖ రాజధానిపై చంద్రబాబు, జగన్.. వైఎస్లా కాదంటూ..
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను చేసిన తప్పులను సరిచూసుకోవడం లేదని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబును మంగళవారం రాజధాని ప్రాంత రైతులు, మహిళలు టీడీపీ కార్యాలయంలో కలిసి పలుసమస్యలను వివరించారు.
డబ్బులు సంపాదించేందుకే విశాఖ..
అమరావతి రాష్ట్ర ప్రజల హక్కు అని.. దాన్ని ఖచ్చితంగా పరిరక్షిస్తానని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. తాను జోలె పట్టింది ఐదు కోట్ల మంది ప్రజల కోసమేనని ఆయన చెప్పారు. మూడు రాజధానులకు ప్రజామోదం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో భూములు కొని అక్కడ డబ్బులు సంపాదిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
వైఎస్లా జగన్ కాదు..
తాను మొదలు పెట్టిన పనులను గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొనసాగించారని గుర్తు చేశారు. తాను ప్రారంభించిన పనులను కూడా ఆయన ఆపలేదని చెప్పారు. జగన్ మాత్రం అలా కాదని, తండ్రి తీసుకొచ్చిన మండలిని.. రద్దు చేశారని మండిపడ్డారు. మరోవైపు మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మూడు రాజధానుల అంశం, మండలి రద్దుపై పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మూడు రాజధానుల ప్రక్రియను అడ్డుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతామని టీడీపీ ఎంపీలు ఈ సందర్భంగా చెప్పారు.
రాజధాని నిర్మాణం కంటే తరలింపునకే ఎక్కువ ఖర్చు
అనంతరం ఎంపీ గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడుతూ అమరావతి నిర్మాణం కంటే రాజధాని తరలింపునకే ఎక్కువ ఖర్చవుతుందన్నారు. రాజధానిని విశాఖ, కర్నూలుకు తీసుకెళ్తే ఎంతవుతుందో సర్కారు చెప్పాలని డిమాండ్ చేశారు. వివిధ రంగాల నిపుణులు కూడా జగన్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారని అన్నారు. అమరావతి నిర్మాణం ఎలా చేయాలనేదానిపై టీడీపీ ప్రభుత్వానికి ప్రణాళిక ఉండేదన్నారు.
రాజధాని మార్పుపై వైసీపీ మేనిఫెస్టోలో పెట్టలేదే..
రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం ఎలా చేస్తారో చెప్పాలన్నారు. తీవ్రవాదులు, నక్సలైట్లపై పెట్టే సెక్షన్లు రైతులపై పెడుతున్నారని ఆరోపించారు. అమరావతి కోసం పోరాటం చేసిన వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గతంలో అమరావతి రాజధానికి మద్దతు పలికిన జగన్.. ఇప్పుడెందుకు మారుస్తున్నారని ప్రశ్నించారు. రాజధాని మారుస్తామని వైసీపీ మేనిఫెస్టోలో పెట్టలేదు కదా అని గల్లా జయదేవ్ ప్రశ్నించారు. రాజధాని మార్పునకు ప్రజామోదం లేదిన గల్లా జయదేవ్ చెప్పారు. రాష్ట్రంలో జగన్ సర్కారు వచ్చిన 8 నెలలుగా అన్ని పనులు నిలిపేశారని అన్నారు. జీఎన్ రావు, బోస్టన్ కమిటీలు ప్రజాభిప్రాయం తీసుకోలేదని తెలిపారు. రైతుల అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదని కోర్టుల ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయని చెప్పారు. రాళ్లు వేశానంటూ తనపై కేసు పెట్టారని గల్లా జయదేవ్ తెలిపారు.
పార్లమెంటులో జగన్ తీరును ఎండగడతాం..
మరో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మాట్లాడుతూ.. జగన్ సర్కారు 5 కోట్ల మంది ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. మండలి ప్రతిపాదనలు ఏడేళ్లుగా కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. మండలి రద్దు జగన్ కుటుంబ సమస్యా? అని ప్రశ్నించారు. మండలి రాజ్యాంగబద్దంగా ఏర్పడిన వ్యవస్థ అని తెలిపారు. మండలిని ఎందుకు రద్దు చేస్తున్నారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంటుపై సీఎం తీరును ప్రస్తావిస్తామని కనకమేడల తెలిపారు.