మహేష్కు న్యాయం చేయండి: జగన్పై చంద్రబాబు ఫైర్, 8వేల కోట్లు ఏం చేశారన్న యనమల
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎస్సీ వైద్యులపై అమానుషంగా ప్రవర్తించడం సరికాదని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.
మహేష్కు న్యాయం చేయండి..
రాష్ట్రంలో పౌరుల ప్రాథమిక హక్కులు కాలరాస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఎస్సీ విద్యార్థి మహేష్ ఉన్నత చదువులకు ఆటంకాలు కలిగించడం సరికాదన్నారు. చదువులకు ఆటంకం కలిగిస్తే విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు. ఇప్పటికైనా మహేష్కు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎస్సీల భూములు లాక్కునే చర్యలను నిలదీయాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.
జగన్ సర్కారు అమానుషాలపై నిలదీయాలి..
దళితుల చదువుకు అడ్డుపడటం ఫాక్షనిస్టుల దుష్ట సంస్కృతి. దళిత వైద్యులపై అమానుషాలు, దళిత జడ్జిపై రాళ్లదాడి, దళిత ఆడబిడ్డలపై అత్యాచారాలు, దళితుల భూములు బలవంతంగా లాక్కోవడం.. వంటి ఈ పాలకుల గతి తప్పిన, మతిమాలిన చర్యలను దళిత సమాజమే నిగ్గదీయాలి' అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
అదే మన సమాజ సంపద: చంద్రబాబు
‘దేశ భవిష్యత్తును నిర్దేశించే యువశక్తికి అంతర్జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. ఇటువంటి స్ఫూర్తిదాయక వేళ ఉన్నత ఉద్యోగాలను అందుకుని ఉజ్వల చరిత్రను లిఖించాల్సిన ఏపీ యువత.. భవిష్యత్తుపై భరోసాలేని 5వేల జీతంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితుల్లో ఉండటం బాధాకరం. తెలుగుదేశం హయాంలో 2014-2019 మధ్య కాలంలో నవ్యాంధ్ర యువతకు 9,56,263 పారిశ్రామిక ఉద్యోగాలు వచ్చాయని ఈ ప్రభుత్వమే చెప్పింది.ఒక్క ఐటీలోనే 30,428 ఉద్యోగాలు ఇచ్చాం.
ప్రభుత్వ ఉద్యోగాలు వేరే.నిరుద్యోగ భృతి, నైపుణ్య శిక్షణ,స్వయం ఉపాధి యూనిట్లు మరెన్నో అందించాం.కానీ ఇప్పుడు అవేవీ లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం యువత నైపుణ్యాలకు, ప్రతిభాపాటవాలకు మెరుగులు దిద్ది... సమాజానికి, రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడేలా, పేరు తెచ్చేలా యువశక్తిని తీర్చిదిద్దాలి. ఎందుకంటే రానున్న కాలంలో యువ జనాభానే మన సమాజ సంపద కానుంది' అని వ్యాఖ్యానించారు.
Recommended Video
కేంద్రం ఇచ్చిన 8వేల కోట్లు ఏం చేశారు జగన్: యనమల
ఇది ఇలావుండగా, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూడా జగన్ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో జగన్ ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. మీరు చెప్పిన కరోనాతో సహజీవనం ఇదేనా? అని ప్రశ్నించారు. వైద్యులు, సిబ్బంది ముందస్తు నియామకాల్లో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన రూ. 8వేల కోట్లు ఏం చేశారు? అని యనమల ప్రశ్నించారు. కరోనా నిధుల వ్యయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని జగన్ సర్కారును డిమాండ్ చేశారు.