చంద్రబాబు..వైఎస్ జగన్..పవన్: ఎవరి ఇళ్లల్లో వాళ్లు! కౌంటింగ్ పర్యవేక్షణ అక్కడి నుంచే
Recommended Video
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ నివాసాల నుంచి ఓట్ల లెక్కింపును పర్యవేక్షిస్తున్నారు. గురువారం ఉదయం ఆరంభమైన ఓట్ల లెక్కింపును దృష్టిలో ఉంచుకుని వారు తమ నివాసాలకు పరిమితం అయ్యారు. దేశ రాజధానిలో ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే పనిలో నిమగ్నమైన ఉన్న చంద్రబాబు నాయుడు.. మంగళవారం రాత్రే గుంటూరు జిల్లాలో ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. పార్టీ శ్రేణులతో భేటీ అయ్యారు. ఓట్ల సరళిని పర్యవేక్షించారు.
ఈ ఉదయం కొందరు పార్టీ కీలక నాయకులు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఓట్ల లెక్కింపును ఉత్కంఠతగా పరిశీలిస్తున్నారు. మీడియా పాయింట్ వద్ద ఎల్ఈడీ తెరను ఏర్పాటు చేశారు. నాయకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేపట్టారు. రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నందున.. ప్రస్తుతానికి పార్టీ వ్యవహారాలన్నీ ఉండవల్లి నుంచే కొనసాగుతున్న విషయం తెలిసిందే.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం హైదరాబాద్లోని లోటస్పాండ్ నివాసం నుంచి తాడేపల్లిలోని తన అధికారిక నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో ఆయనను పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఓట్ల లెక్కింపును ఆయన ఇంటి నుంచే పర్యవేక్షిస్తున్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మరి కొంత సేపట్లు తాడేపల్లికి వస్తారని చెబుతున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ప్రస్తుతం వైఎస్ జగన్తో పాటే ఉన్నట్లు తెలుస్తోంది.
వైఎస్ జగన్ నివాసం, పార్టీ కేంద్ర కార్యాలయం ఒకే ప్రాంగణంలో ఉన్నందున..నాయకులు, కార్యకర్తలు ఉదయం నుంచే ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. తాడేపల్లి నివాసం సందడిగా మారింది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా బుధవారమే అమరావతి ప్రాంతంలోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచే ఓట్ల సరళిని పరిశీలిస్తున్నారు.