ఎలా ఉంది!: పుష్కర భక్తులతో బాబు, ఫెర్రీలో తప్పిన ప్రమాదం, అఘోరాల స్నానం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు ధ్యాన బుద్ధ ఘాట్ వద్ద సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పలువురు భక్తులను వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. సౌకర్యాల పైన వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
అమరావతికి వచ్చిన చంద్రబాబు ధరణికోట, ధ్యాన బుద్ధ ఘాట్కు వెళ్లి భక్తులతో మాట్లాడారు. పుష్కర ఏర్పాట్లు ఎలా ఉన్నాయని ప్రశ్నించిన ఆయనకు.. చాలామంది నుంచి బాగున్నాయని సమాధానం వచ్చింది. దీంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
ఏర్పాట్లలో ఏమైనా లోపాలుంటే తనకు చెప్పాలని, వాటిని వెంటనే సరిదిద్దుతానని భక్తులతో వ్యాఖ్యానించారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ఎక్కువ సేపు చూడవలసి వస్తోందని కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో యుద్ధ ప్రాతిపదికన మరిన్ని గదులు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఘాట్ సమీపంలో నమూనా ఆలయాలను ఆయన సందర్శించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిలో ప్రకృతి పట్ల ప్రేమను పెంచాలన్నారు.
అన్ని శాఖలు సమన్వయంతో పుష్కరాలను విజయవంతం చేస్తున్నామన్నారు. వచ్చే కృష్ణా పుష్కరాల నాటికి రాష్ట్రంలో కరువు అనే పదం వినిపించవద్దన్నారు. అంతకుముందు చంద్రబాబు అమరావతిలో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఫెర్రి ఘాట్లో అఘోరాల స్నానం
ఫెర్రి ఘాట్లో అఘోరాలు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. కృష్ణా నదిలోకి అడుగుపెడుతూనే వారు శివ నామస్మరణతో ఢమరుకం వాయిస్తూ స్నానం ఆచరించారు.
తప్పిన ప్రమాదం
కృష్ణా జిల్లాలోని ఫెర్రి ఘాట్ వద్ద ప్రమాదం తప్పింది. ప్రసాదం తయారీ షెడ్డుకు విద్యుత్ తీగలు తగిలాయి. అక్కడున్న వారు వెంటనే అప్రమత్తమై విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ప్రమాదం తప్పింది. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. మరోవైపు, సీతానగర్లోని పుష్కర ఘాట్ వద్ద పెద్ద ఎత్తున వచ్చిన గాలి దుమారానికి అక్కడున్న టెంట్లు కూలిపోయాయి. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.