నాగపట్నంలో చిక్కుకున్న తెలుగువారు, ఖుష్బూ ట్వీట్: ఏపీకి కేంద్రం రూ.330 కోట్లు
చెన్నై/హైదరాబాద్: తమిళనాడులోని నాగపట్నం సందర్శనకు వెళ్లిన కొందరు తెలుగువారు వరదల్లో చిక్కుకున్నారు. గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాలకు చెందిన సుమారు మూడువందల మంది చిక్కుకున్నారు. భారీ వర్షాలు నాగపట్నంపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వారు సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
భారీ వర్షాల కారణంగా రైలు పట్టాలపై వరదనీరు ప్రవహిస్తుండటంతో పట్టాలు దెబ్బతిని గూడూరు - చెన్నైల మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పలు రైళ్లను గూడూరు, రేణిగుంట మీదుగా దారి మళ్లించారు.
పలు రైళ్లను గూడూరు వరకు మాత్రమే నడుపుతున్నారు. దీంతో చెన్నై వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. గురువారం మొత్తం పదహారు బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులను తమిళనాడుకు తరలించారు.
ఖుష్బూ ట్వీట్
చెన్నైని భారీ వర్షాలు అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ప్రజలు ఇళ్ల పైకి, బ్రిడ్జిల పైకి ఎక్కి తలదాచుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాలైతే పూర్తిగా జలమయమయ్యాయి. పలుచోట్ల ఇళ్ల గోడలు కూలిపోయాయి. ప్రజలు రోడ్డునపడ్డారు. అలాంటి పరిస్థితిలో ఉన్న కొందరు కొట్టుర్పురం బ్రిడ్జిపై చేరిన ఫొటోను కాంగ్రెస్ నేత, నటి ఖుష్బూ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఏపీకి కేంద్రం తక్షణ సాయం రూ.330 కోట్లు
భారీ వర్షాలు, వరదలతో ఏపీలోని ఎస్పీఎస్ నెల్లూరు, చిత్తూరు జిల్లాలు పూర్తిగా నీటిలో చిక్కుకుపోయాయి. ఈ నేపథ్యంలో 2015-16 సంవత్సరానికిగానూ రూ.330 కోట్లు ఇవ్వనున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ సింగ్ గురువారం లోకసభలో ప్రకటించారు.
వరద సాయంగా రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని ఏపీ సర్కార్ కోరిందన్నారు. వర్షాల ప్రభావం గురించి సిఎం చంద్రబాబుతో మాట్లాడానని, వరద నష్టాన్ని అంచనా వేసేందుకు త్వరలోనే కేంద్ర బృందం పర్యటిస్తుందన్నారు.కేంద్ర బృందం నివేదిక తరువాత ఏపీకి మరింత సాయం చేస్తామని రాజ్నాథ్ చెప్పారు.